Breaking News

2019-24 మధ్య విద్యుత్ రంగానికి చీకటి రోజులు

-గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని 9 నెలల్లో గాడిన పెట్టాం
-ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం. ఇప్పటి వరకు రూ.5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
-సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ప్రతి ఒక్కరూ ఆదాయం పొందే విధానాన్ని తీసుకొస్తాం
-యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.16 నుంచి రూ.4.80కి తగ్గించేందుకు ప్రయత్న
-1998లో తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలో ఆ రంగాన్ని నిలబెట్టాయి
-ప్రతి నియోజకవర్గంలో 10 వేల రూఫ్‌టాప్‌ల ఏర్పాటు…పీఎం కుసుమ్ కింద 4 లక్షల పంపుసెట్ల
-రాబోయే నాలుగేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచం
-డెమొక్రటైజ్ పవర్ జనరేషన్ తో విద్యుత్ ఉత్పత్తిని ప్రజలకు ఆదాయ వనరుగా మార్చుతాం
-శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘2019-24 మధ్య విద్యుత్ రంగానికి చీకటి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని 9 నెలల్లోనే గాడిన పెట్టాం. గత పాలకుల విధ్వంసం వల్ల ఆ రంగంలో వ్యవస్థలో అంతుబట్టని సమస్యలు ఉన్నాయి. 30 ఏళ్లుగా నా మనసుకు దగ్గరగా ఉండే విభాగం ఇంధనరంగం. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత టీడీపీదే. క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించాక రూ.5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నాం. దీని ద్వారా రాష్ట్రంలోని 3.66 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పాం…ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.16 నుంచి రూ.4.80కి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో విద్యుత్ రంగంపై సీఎం ప్రసంగించారు.

రైతుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసి పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇచ్చాం
ఏ పని జరగాలన్నా విద్యుత్ అవసరం. నిజ జీవితంలో విద్యుత్ వినియోగం చాలా కీలకం. తలసరి విద్యుత్ వినియోగాన్ని బట్టి అభివృద్ధిని అంచనా వేస్తాం. ఇంధన రంగంలో అనేక మార్పులు వచ్చాయి. 30 ఏళ్లకు ముందు ఉన్న వ్యవస్థను చూశాను…ఇప్పుడున్న వ్యవస్థను చూస్తున్నాను. 2004కు ముందు మేం అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్షాలు వెళ్లి విద్యుత్ సౌధ వద్ద ఆందోళనలు చేసేవి. నేను అసెంబ్లీ నుంచి బటయకు వెళ్లి పొలాలు చూసి వచ్చి మళ్లీ సభ్యులకు సమాధానం చెప్పేవాన్ని. గతంలో గ్రామాల్లో కరెంట్ ఎప్పుడో వస్తుందో తెలీదు. ఇక రైతులు అయితే కరెంట్ రాగానే రైతులంతా ఒకేసారి మోటార్లు వేసేవారు. లో ఓల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయేవి. నేను 2012లో పాదయాత్ర చేశాను. కొన్నిచోట్ల రైతులు చలిమంట వేసుకుని కరెంట్ కోసం కూర్చునేవారు. ఏంటి ఇక్కడ కూర్చున్నారని అడిగితే కరెంట్ కోసం చూస్తున్నామని చెప్పారు. చాలా మంది రైతులు పాముకాటుకు గురయ్యేవారు. ఇవన్నీ చూశాక 2014లో అధికారంలోకి వచ్చాక 9 గంటల విద్యుత్ పగటిపూటే ఇచ్చాం. వ్య

స్పాట్ బిల్లింగ్ విధానాన్ని తెచ్చాం
వసాయానికి ఎంతోకొంత రైతుల నుంచి వసూలు చేసేవారు. మేం వచ్చాక స్లాబ్ రేట్ తెచ్చి రైతులను ఆదుకున్నాం. దీంతో మీటర్ రీడింగ్ కోసం స్పాట్ బిల్లింగ్ విధానాన్ని తీసుకొచ్చాం. ప్రపంచమంతా అధ్యయం చేశాను. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే. అప్పుడు నన్ను ప్రతిపక్షాలు ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు. అయినా ప్రజలకోసం, రాష్ట్రంకోసం ఆ మాట పడ్డాను. 1995లో 10 నుంచి 15 గంటలదాకా విద్యుత్ కోతలు ఉండేవి. 1998లో సంస్కరణలు దేశంలోనే మొట్టమొదటి సారి తెచ్చాం. ఎనర్జీ ఆడిటింగ్ విధానం తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్ మిషన్ కమిటీలుగా విభజించాం. కరెంట్ కొరతలను 2004 నాటికి అధిగమించాం. కరెంట్ కొరతలేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం. ఆ ఫలితాలు చూసి సంతోషించా. కానీ అవి ప్రజలకు అర్థంకాకపోవడం 2004లో ఓడిపోవడానికి కారణం అయింది. రాష్ట్రానికి లాభాలు వచ్చాయి…నాకు కష్టాలు వచ్చాయి.

1998 సంస్కరణలను నిర్వీర్యం చేశారు
నేను సీఎంగా ఉన్న సమయంలో బొగ్గు నిల్వలు పెద్ద సమస్య ఉండేది కాదు. నాణ్యత లేకుండా చేయడం, లేదంటే అసలు బొగ్గే లేకుండా చేయడంతో థర్మల్ పవర్ స్టేషన్లు సామర్థ్యం మేరకు పని చేయలేదు. 1998 నాటి సంస్కరణలు నిర్వీర్యం చేశారు. 2012-13 మధ్య జాతీయ స్థాయిలో విద్యుత్ లోటు 8.7 శాతం ఉంటే మన రాష్ట్రంలో 17.6 శాతం ఉండేది. విద్యుత్ రంగానికి బడ్జెట్ కేటాయింపులు కూడా 7.8 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.1995 నుంచి 2004 మధ్య విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 90 శాతానికి పెంచితే తర్వాత 56 శాతానికి తగ్గించారు. 2004లో యూనిట్ విద్యుత్ ధర రూ.2.55 ఉంటే అది 2014 నాటికి రూ.5.25కు పెంచారు. దీంతో వినియోగదారులపై మోయలేని భారం పడింది. విద్యుత్ కోతల్లేని పరిస్థితి నుంచి గంటలకొద్దీ కోతలు విధించే పరిస్థితికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో రైతులపై రూ.28,535 కోట్లు భారం వేశారు.

ఒక వ్యక్తి అహం వల్ల రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది
2014లో అధికారంలోకి వచ్చాక మళ్లీ విద్యుత్ అంశంపై స్టడీ చేశాం. 22.5 మిలియన్ల కొరత ఉంటే సవాల్‌గా తీసుకుని 2018 జనవరి నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం. జాతీయ తలసరి వినియోగం 17 శాతం ఉంటే మనం 23 శాతానికి పెంచాం. సోలార్, విండ్ ద్వారా 7,700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాం. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా చేయలేదు. ఐదేళ్లు కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ అందించాం. 2019-24లో మధ్య మల్లీ చీకటి రోజులు వచ్చాయి. అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేశారనడానికి ఇదొక కేస్ స్టడీ. విద్యుత్ రంగాన్ని మళ్లీ చీకట్లోకి నెట్టారు. ఏ రాష్ట్రంలోనైనా పీపీఏల ఆధారంగా పెట్టుబడులు పెడతారు. దావోస్‌లో కూడా పీపీఏల రద్దుపై చర్చలు జరిగాయి. వితండ వాదంతో కావాలని అవినీతి ఆరోపణలు చేసి సోలార్ విద్యుత్ వాడలేదు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో రూ.9 వేల కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఆనాడు కరెంట్ వాడుకుని ఉంటే మనకు సమస్యలు వచ్చేవి కాదు. ఒక అహంకారం వల్ల రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది.

గత ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు
కృష్ణపట్నం స్టేజ్ 2, వీటీపీఎస్ స్టేజ్ 5 ఆలస్యమయ్యాయి. దీనివల్ల అదనపు అవుతోంది. పోలవరం హైడ్రో పవర్ కూడా ఆలస్యం వల్ల రూ.1044 భారం పడుతుంది. అవకతవక నిర్ణయాలు, అసమర్థత వల్ల రూ.62,826 కోట్లు ఉన్న అప్పులు రూ.1,12,422 కోట్లకు పెరిగింది. విపరీతంగా టారిఫ్‌లు పెంచి 9 సార్లు విద్యుత్ ఫెంచారు. రూ.32 వేల కోట్లు పేదలపై భారం వేశారు. 50 యూనిట్లు ఉపయోగించేవారిపై రూ.101 నుంచి రూ.199కి అనగా 98 శాతం, 100 యూనిట్లు వాడేవారికి రూ.244 నుంచి రూ.453కి అనగా 86 శాతం, 200 యూనిట్లు వాడేవారికి రూ.632 నుంచి రూ.1,123కి అనగా 78 శాతం, 300 యూనిట్లు వాడే వారికి రూ.1,573 నుంచి రూ.2,037కి అనగా 26 శాతం చొప్పున ఛార్జీలు పెంచారు. పేదలపై పెనుభారం వేశారు. టారిఫ్ సర్దుబాటు పేరుతో రూ.16,699 కోట్లు భారం వేశారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన నాకే ఈ రకరకాల పేర్లు నాకే అర్థం కాలేదు. ఫ్యూయల్ సర్‌ఛార్జీ పేరుతో రూ.5,886 కోట్లు, ట్రూఅప్ ఛార్జీలు రూ.3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.5,604 కోట్లు వేశారు. నేనున్నప్పుడు 6 పైసలువేస్తే అది కూడా విద్యుత్ బోర్డే తీసుకునేది. 2019-24 మధ్య 9 సార్లు ఛార్జీలు పెంచి రూ.32,166 కోట్లు భారం వేశారు. మళ్లీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6073 కోట్లు, 2023-24లో రూ.6544 కోట్లు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్మెస్టమెంట్ కోసం ఏపీఈఆర్సీలో పిటిషన్ వేశారు. గత ప్రభుత్వం పెంచిన ఛార్జీల భారం గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రజలపై పడింది. పవర్ సప్లై అగ్రిమెంట్, సెకీలు భారంగా అయ్యాయి. కానీ సంతకాలు పెట్టాక వెనక్కి తీసుకుంటే ఫినాల్టీలు కట్టడంతోపాటు, విశ్వతనీయత పోతుంది. అయినప్పటికీ వీటన్నింటినీ సాకుగా చూపి తప్పించుకోవడానికి సిద్ధంగా లేను.

ప్రతి నియోజవర్గంలో 10 వేల రూఫ్‌టాప్‌ల ఏర్పాటు
భూతాపం పెరిగుతోంది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ, హైడల్, రెన్యూవబుల్, బ్యాటరీ విద్యుత్ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నాం. కరెంట్‌ను ఇళ్లు, పరిశ్రమలు, వాహనాలకు వాడుతున్నాం. సస్టెయినబుల్ ఎకానమీ ఉండాలంటే గ్రీన్ ఎనర్జీ వినియోగం తప్ప మరో మార్గం లేదు. రాబోయే రోజుల్లో విమానాలు, ఓడలు కూడా గ్రీన్ ఎనర్జీతో నడిచేలా రాబోతున్నాయి. ఎనర్జీని ఎగుమతికి ఉపయోగించుకోబోతున్నాం. 500 గిగా వాట్లు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు అందులో మనం 160 గిగావాట్లు టార్గెట్ పెట్టుకున్నాం. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజీలీ యోజన్ కింద ప్రతి ఒక్కరి ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సూర్యఘర్ కింద 2 కిలో వాట్‌ల విద్యుత్ ఉత్పత్తికి రాయితీ అందిస్తాం. ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక్కో నియోజకవర్గానికి 10 వేల ఇండ్లపై సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోవాలి. ఉదాహరణకు 240 యూనిట్లు సూర్యఘన్ ద్వారా ఉత్పత్తి చేస్తే, అందులో 100 యూనిట్లు వినియోగదారులు వాడుకుంటే మరో 140 యూనిట్లు వారి వద్ద ఉంటుంది. 9 ఏళ్ల పేబ్యాక్ పీరియడ్ అయిన తర్వాత సోలార్ రూఫ్‌టాప్ నుంచి గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఆదాయం వస్తుంది. ఉదాహరణకు 140 యూనిట్లు గ్రిడ్‌కు విక్రయిస్తే ఒక్కో కుటుంబానికి రూ.300 ఆదాయం వస్తుంది. నిర్వహణకు కూడా ఏజన్సీని పెడతాం. 3 కిలో వాట్స్‌కు రూ.78 వేలు సబ్సీడీ వస్తుంది. మిగతా 70 వేలకు అవసరమైతే పెట్టుబడి ప్రభుత్వమే పెడుతుంది, లేదంటే బ్యాంకు ద్వారా రుణం అందిస్తాం. ఈ పథకం ద్వారా 1,559 మెగావాట్ల ఉత్పత్తికి ఆస్కారం ఉంది. రూ.8,937 కోట్లు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.4,663 కోట్లు, రాష్ట్రం రూ.4,274 కోట్లు ఖర్చు చేస్తుంది.

పీఎం కుసుమ్ కింద 4 లక్షల పంపుసెట్లు
పీఎం కుసుమ్ కింద లక్ష వ్యవసాయ పంపుసెట్లను ఎమ్ఎన్ఆర్ఈ(మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) కేటాయించింది. మనం మరో 4 లక్షల సోలార్ పంపుసెట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరాం. మొదటి దశ కింద రాష్ట్రంలో 3.85 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఏర్పాటు ద్వారా 1,327 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. 220 మెగావాట్ల 49,533 సోలార్ అగ్రికల్చర్ పంపుసెట్లకు, 751 మెగావాట్ల 1,67,452 సోలార్ అగ్రికల్చర్ పంపుసెట్లకు విడివిడిగా టెండర్లు పిలిచాం. సబ్ స్టేషన్ దగ్గర పవర్ జనరేషన్ జరుగుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 47.82 గిగావాట్లు రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి ఉంటుంది. ఇందులో 13.79 గిగావాట్ల సోలార్, 9.93 గిగావాట్ల విండ్, 24.10 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ఉంటుంది.బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్రం ఇస్తోంది. 1000 మెగావాట్లకు రూ.270 కోట్లు వీజీఎఫ్ కేంద్రం ఇస్తోంది. జమ్మలమడుగు, ఘనిలో 225-450 మెగావాట్లు చొప్పున, కుప్పంలో 50-100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ కోసం ఎంపిక చేశాం. పంప్డ్ ఎనర్జీ కంటే బ్యాటరీ స్టోరేజీ ఖర్చు ఎక్కువ అవుతుంది. కరెంట్ చార్జీలు ఎందుకు పెరుగుతున్నాయనుకున్నందుకు 2014 నుంచి 2018 వరకు రూ.4.40 సగటు యూనిట్ కాస్ట్ అవుతోంది. 2019 నుంచి 24 వరకు సగటున యూనిట్ కొనుగోలుకు రూ.6.90 అయింది. ఈ భారం ప్రజలే మోస్తున్నారు.

రాష్ట్రంలో 5 వేల ఈవీ స్టేషన్‌లు
ఎలక్ట్రిటిక్ వాహనాల వినియోగంలో వెనకబడి ఉన్నాం. గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 30 కి.మీ ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున మొత్తం 5 వేల స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి కాకుండా 26.26 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రాబోయే ఐదేళ్లలో జెన్‌కో ద్వారా రూ.1.07 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేసి మనకు కావాల్సిన విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునేందుకు ముందుకెళ్తున్నాం. ట్రాన్స్ మిషన్ కెపాసిటీని 16,507 మెగావాట్లకు పెంచుతాం. దీనికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

 తేదిన గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ మరియు జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *