-అర్హులైన 85 మంది వైద్యులలో 50 మంది పదోన్నతికి నిరాకరణ
-ఆందోళన వ్యక్తం చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
-పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయిలో ఏర్పడిన జిల్లా ఆరోగ్యసేవల సమన్వయకర్తల (DCHS)పోస్టులకు శుక్రవారం చేపట్టిన భర్తీ ప్రక్రియలో తొమ్మిది మంది ప్రభుత్వ డాక్టర్లు పదోన్నతి పొందారు. ప్రస్తుతం 6 డిసిహెచ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉండగా, త్వరలో మరో 2 ఖాళీలు ఏర్పడనున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ 9 మందికి డిసిహెచ్ లుగా పదోన్నతులను శుక్రవారం ఆమోదించారు. జిల్లా స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సిహెచ్సిలు), జిల్లా మరియు ఏరియా ఆసుపత్రుల పనితీరును జిల్లా ఆరోగ్యసేవల సమన్వయకర్తలు పర్యవేక్షిస్తారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ కింద పనిచేసే సిహెచ్సి, జిల్లా, ఏరియా ఆసుపత్రులు మొత్తం 224 ఉన్నాయి. సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ (CSS) హోదాలో మూడేళ్ల పాటు సేవలందించి, పదవీ విరమణకు ముందు రెండేళ్ల సర్వీస్ మిగిలి ఉన్న వైద్యులు DCHSగా పదోన్నతికి అర్హులవుతారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల DCHS పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో త్వరలో ఖాళీలేర్పడతాయి పదోన్నతికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించిన వైద్య, ఆరోగ్య మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్, పదోన్నతికి అర్హులైన 85 మంది అభ్యర్థులలో 50 మంది DCHSగా పదోన్నతికి నిరాకరించినట్లు గమనించారు. అర్హత కలిగిన వైద్యులలో 59 % మంది పదోన్నతికి ఇష్టపడకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల చేపట్టిన పదోన్నతుల ప్రక్రియలో 33% మంది అర్హత కలిగిన వైద్యులు ప్రొఫెసర్లుగా పదోన్నతికి నిరాకరించిన నేపథ్యంలో తాజాగా DCHSగా పదోన్నతికి నిరాకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెకండరీ మరియు టెర్షియరీ హెల్త్కేర్ లో పనిచేసే ప్రభుత్వ వైద్యులు పదోన్నతులను తిరస్కరించడానికి గల కారణాలు మరియు సాధ్యమయ్యే పరిష్కార చర్యలను క్షుణ్ణంగా సమీక్షించాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులందచేసిన సమాచారం ప్రకారం, చాలా మంది ప్రభుత్వ వైద్యులు తమకు నచ్చిన ప్రదేశాలలో మాత్రమే పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. తమకు నచ్చిన ప్రదేశాలలో పోస్టింగ్స్ రాకపోవటంతో పదోన్నతికి ఇష్టపడని పరిస్థితికి దారితీస్తోంది. ఫలితంగా… పదోన్నతికి అర్హులైన వైద్యులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ పొందే వరకు అదే విధంగా తిరస్కరిస్తున్నారని ఉన్నతాధికారులు మంత్రికి సమర్పించిన నివేదికలో తెలియచేశారు. ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలించి అవసరమైన పరిష్కార చర్యలు చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.