-మైదానప్రాంత గిరిజనులకు తరతరాలుగా అన్యాయం
-ఎరుకలు, యానాదులు, చెంచులు కమ్మర్లు సుగాలీలకు టికెట్లు ఇవ్వరా?
-వారి సమస్యలు అసెంబ్లీ దృష్టికి ఇక ఎలా వస్తాయి?
-మైదానప్రాంత గిరిజన సదస్సులో గళమెత్తిన నేతలు
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనులకు చట్టపరంగా ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కల్పిస్తున్నా… కొన్ని కులాలకు అసలు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోతోందని పలువురు నేతలు గళమెత్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం మైదానప్రాంత గిరిజన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, బీఎస్సీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ డీజీపీ జె.పూర్ణచంద్రరావు, మరో సమన్వయకర్త బక్కా పరంజ్యోతి తదితరులు మాట్లాడారు. ముందుగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రకారం రాష్ట్రంలో మొత్తం జనాభా 4.32 కోట్లు. అందులో ఎస్టీలు – 25,34,795. మొత్తం జనాభాలో వారి శాతం-5.86%. 2011లో కేంద్రం నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.94 కోట్లు. నేషనల్ కమిషన్ టెక్నికల్ గ్రూప్ ఆన్ పాపులేషన్ ప్రొజెక్షన్ ప్రకారం రాష్ట్ర జనాభా (10.02.2025 నాటికి) 5.35 కోట్లు. ఎస్టీలలో ప్రధానంగా యానాదులు, ఎరుకలు, సుగాలీలు, చెంచు లు కమ్మర్లు కొండదొరలు, కోయలు, జాతాపులు, కోర్లు, సవర్లు, కొండ రెడ్లు, బగతలు.. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరికీ సమానమైన ప్రాతినిధ్యం లేదు. రాష్ట్రంలో కమ్మ, రెడ్ల రాజకీయం ఎక్కువగా నడుస్తోంది. వాళ్లు తప్పనిసరిగా రిజర్వేషన్ల ప్రకారం ఇవ్వాల్సిన ఏడు అసెంబ్లీ సీట్లను ఏజెన్సీ ప్రాంతంలో సర్దేస్తున్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు అవకాశం అస్సలు దక్కడం లేదు. రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని మైదాన ప్రాంతంలో ఎస్టీలకు అస్సలు ఎస్టీ నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం లేదు. ఏజెన్సీ ప్రాంతాలకు సర్దేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ యానాదులు, ఎరుకులు, సుగాలీలు చెంచులు కమ్మర్లు తదితరులుంటారు. మొత్తం ఎస్టీ లలో % వీళ్లే ఉంటారు. కానీ, యానాదులు, ఎరుకలకు అస్సలు ఎమ్మెల్యే టికెట్లే దక్కడం లేదు. ఎప్పుడో ఒకసారి వెంకటేశ్వర్లు అనే నాయకుడు, పెంచలయ్య యానాది నాయకుడు ఎమ్మెల్యేలు అయినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవలి కాలంలో కుంభా రవిబాబు ఎస్.కోట ప్రాంతానికి చెందినవారు. ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.
ఎస్టీలలో అత్యధికంగా ఉన్నవారు యానాది కులస్థులు. వారు సుమారు 5 లక్షల పై చిలుకు ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ఎరుకలు, సుగాలీలు, కొండదొరలు, కోయలు, జాతాపులు, కోదులు, సవరలు, కొండరెడ్లు.. ఇలా ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 115 మంది ఎస్టీలు ఎమ్మెల్యేలయ్యారు. జనాభా దామాషా ప్రకారం సంఖ్య చూసుకుంటే సరిగ్గానే ఉంటుంది. కానీ యానాది, ఎరుకల, సుగాలీ చెంచులు కమ్మర్లు నుంచి ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇది నిజమైన ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని కులాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉంటేనే వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంటుంది” అని సూచించారు.
పూర్ణచంద్ర రావు గారు త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)లోనైనా మైదాన ప్రాంత గిరిజనులకు న్యాయం చేయాలి. వారికి కనీసం మూడు నాలుగు స్థానాలు కేటాయించాలి. మైదాన ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గిరిజన సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లు చాలా అధ్వాన్నంగా ఉంటున్నాయి. వాటికి అరకొరగానే నిధులు కేటాయిస్తున్నారు. అలాగే మైదాన ప్రాంత గిరిజనుల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్ కూడా నామమాత్రంగానే ఉంటోంది. దానికి కూడా నిధులు ఇవ్వడం లేదు. ప్రతి జిల్లాలోనూ ఐటీడీఏ ఏర్పాటుచేసి, బ్యాంకులతో సంబంధం లేకుండా గిరిజనుల్లో మైదాన ప్రాంతంలో ఉండేవారిని కూడా సమాజంలో పైకి తీసుకురావాలి. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి” అని తెలిపారు.
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎల్ ఎస్టీ నాయకుడు పేరం సత్యం మాట్లాడారు
బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త బక్కా పరంజ్యోతి మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో ఎస్టీ ఉప ప్రణాళిక పేరుతో నిధులు కేటాయించినట్లు చూపిస్తున్నా, వాస్తవ ఖర్చు దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాటిని వేరే కార్యక్రమాలకు మళ్లిస్తున్నారు. గిరిజనులకు ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం పెట్టాల్సిన ఖర్చు అస్సలు పెట్టడం లేదు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించేలా చేయాలంటే ఉద్యమించక తప్పేలా లేదు. అలాగే యానాదులు, ఎరుకలు, సుగాలీల్లాంటి మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి” అని డిమాండు చేశారు.
Prajavartha Online Telugu News