-ఎన్డీఏ కూటమి విధానాలపై కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి ఫైర్
-18న సామాజిక న్యాయం కోసం ఆందోళనలు, ఉద్యమాలు ఉధృతం చేస్తాం : జి.ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనతో ప్రజల జీవన పరిస్థితులు దయనీయంగా మారిపోయాయని, బలమైన ఉద్యమాలు నిర్మించడం ద్వారా ఈ అధ్వాన పాలనకు చరమగీతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డిలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశం బుధవారం విజయవాడలోని దాసరిభవన్లో జరిగింది. పి.రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ, వెంకటరెడ్డి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య భవిష్యత్ కర్తవ్యాలను గురించి వివరించారు.
ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రైవేటీకరణ, అప్పులు, అవినీతితో చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందని విమర్శించారు. విద్య, వైద్యం వంటి ప్రాధాన్యత రంగాలతోపాటు సర్వం ప్రైవేటీకరణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి జరుగుతున్నదన్నారు. 70% ప్రాథమిక విద్యను ప్రైవేటువారి చేతుల్లో పెట్టిన కూటమి సర్కారు మెడికల్ కాలేజీలన్నింటినీ అమ్మేసిందని, ఇకపై ఉన్నతవర్గాలకు తప్ప సామాన్యునికి వైద్య విద్య అందే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ స్టాఫ్ కొరతతో యూనివర్శిటీలు మూతపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అంతకుమించిన అప్పులతో రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టేశారన్నారు. కేవలం 17 నెలల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనంతగా రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రికార్డు సృష్టించారని దుయ్యబట్టారు. ఇందులో రూ.1,40,000 కోట్లు బడ్జెట్ అప్పులే ఉన్నాయని, ప్రతి మంగళవారమూ అప్పు తీసుకోవడాన్ని ఆనవాయితీగా పెట్టుకోవడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనాచరిత్రలోనే అడ్డుఅదుపూలేని అవినీతిని చూడాల్సి వస్తున్నదని, రూ.10,000 కోట్ల విలువైన ఒక ఊరినే అనంతపురంలో కబ్జా చేయడానికి అధికారపార్టీ నాయకులు యత్నిస్తున్నారంటే, టీడీపీ అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతున్నదని అన్నారు. మోదీకి మరింత దగ్గరవుతున్న చంద్రబాబు రాష్ట్రంలో పక్కా ఎన్డీఏ పాలనకు తెరతీశారని, గాడితప్పిన కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అభాసుపాలు కావడం ఖాయమని రామకృష్ణ అన్నారు. ఈ విధానాలను పార్టీ కార్యకర్తలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వ ఓటమి ఖాయమని, తేజస్వి యాదవ్ నాయకత్వంలో మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్లో కులంతోపాటు భూ సమస్య వేధిస్తున్నదని, భూసమస్యపై పోరాడిన చరిత్ర కేవలం వామపక్షాలకు మాత్రమే ఉందని, 9 స్థానాలో పోటీ చేస్తున్న సీపీఐకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్కు చాలా కీలకమన్నారు. తీవ్ర పేదరికం నుంచి కేరళను విముక్తి చేసిన ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాలు దేశానికే మార్గదర్శకమని అన్నారు. నూటికి నూరు శాతం దుర్భర దారిద్య్రాన్ని తొలగించడంతోపాటు వందశాతం అక్షరాస్యత, భూసంస్కరణలు అమలు చేసిన ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచిందని, మానవ అభివృద్ధి సూచీలోనూ ముందంజలో నిలిచిందని కొనియాడారు. కమ్యూనిస్టుల పాలనలో కేరళ అభ్యున్నతి సాధించడం గర్వకారణంగా వుందన్నారు.
పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ, చండీగర్లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభలు ఇచ్చిన పిలుపుమేరకు వామపక్షాల ఐక్యత దిశగా పార్టీశ్రేణులను నడిపించాలని పిలుపునిచ్చారు. సైద్ధాంతికంగా, రాజకీయంగా, నిర్మాణపరంగా బలోపేతం కావడానికి సమస్యల ప్రాతిపదికగా ఉద్యమ నిర్మాణాలే శరణ్యమని అన్నారు. సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన రాజకీయ నిర్ణయాలు అత్యంత అవశ్యమని చెప్పారు. వామపక్షాలు ఆత్మవిమర్శనాదృష్టితో లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఒకతాటిపైకి తీసుకువచ్చినప్పుడే మతోన్మాద, ఫాసిస్టు బీజేపీని గద్దె దించగలమని చెప్పారు. ఇండియా కూటమి బలోపేతం కావడానికి కాంగ్రెస్ చొరవ చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ సైతం మద్దతునిచ్చిందని, అయితే కేంద్రంలో బీజేపీ నాటకాలాడుతూ బీసీ వర్గాలను దగా చేస్తున్నదన్నారు. సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు సందర్భంగా డిసెంబరు 26వ తేదీన ఖమ్మంలో కనీవినీ ఎరుగనిరీతిలో జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ సీపీఐ వందేళ్ల ముగింపు కార్యక్రమం పురస్కరించుకొని, డిసెంబరు 26వ తేదీన జరిగే ‘చలో ఖమ్మం’ కార్యక్రమంలో ప్రతి జిల్లా నుంచి విస్తృతంగా పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదే నెలలో 20 నుంచి 26వ తేదీ వరకు సీపీఐ శతవార్షికోత్సవ వారోత్సవాలు జరపాలని, వాడవాడలా ఎర్రజెండాలు రెపరెపలాడాలని కోరారు. సామాజిక న్యాయంపై నవంబరు 18వ తేదీన జరిగే ఆందోళన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని నిర్వహించాలని, బీసీ జనగణనపై సీపీఐతో కలిసివచ్చే అన్ని పక్షాలను కలుపుకుపోవాలని, రాబోయే స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జాతా 12న జరిగే ‘చలో అనంతపురం’తో ముగుస్తుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నవంబరు 14న 300 మందితో బాలసంఘాన్ని పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. 18, 19 తేదీల్లో రైతుసంఘం ఆధ్వర్యంలో కర్నూలులో జరిగే పత్తి రైతుల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తొలుత అమరవీరులకు నివాళులర్పిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు తాటిపాక మధు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా, సభికులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కౌన్సిల్ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, అక్కినేని వనజ పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చంద్రనాయక్, పెంచలయ్య విప్లవ గీతాలు ఆలపించారు.
Prajavartha Online Telugu News