– భావితరాలకు వారసత్వ సంపదను అందించే బృహత్కర కార్యక్రమం
– పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మన నాగరికతకు ప్రతీకలు
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా తొలుత 5కే హెరిటేజ్ వాక్ జరిగింది. నగరంలోని బాపూ మ్యూజియం నుంచి మొగల్రాజపురం గుహలు వరకు హెరిటేజ్ వాక్ జరిగింది. సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణలో ప్రతిఒక్కరం భాగస్వాములమవుదాంటూ పిలుపునిచ్చారు. ఈ వాక్లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాక్) విజయవాడ చాప్టర్ కన్వీనర్, చరిత్ర పరిశోధకులు సాయి పాపినేని సారథ్యంలోని బృందం, యువజన సంక్షేమ శాఖ అధ్యక్షులు డా. కొల్లేటి రమేష్, పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఆర్కియాలజీ, మ్యూజియం శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, చరిత్రాభిమానులు, సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్న పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు, చరిత్ర పరిశోధకులు సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు మన నాగరికతకు ప్రతీకలని, వాటి సంరక్షణ ద్వారా భావితరాలకు చరిత్రను చేరవేయగలమని తెలిపారు. హెరిటేజ్ వాక్ ద్వారా యువతలో చారిత్రక చైతన్యం, వారసత్వ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని వివరించారు.
Prajavartha Online Telugu News