-కాలువల మరమ్మతులు వేగవంతం చేయాలి.
-ఖరీఫ్-2026 ను సమర్ధవంతంగా నిర్వహించాలి.
-వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల కోఆర్డినేషన్ మీటింగ్.
-మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వలు ఆధారంగా, రానున్న ఖరీఫ్ సీజన్ కు సాగు నీటి విడుదలకు సంబందించి షెడ్యూల్ విడుదల, విత్తనాలు, ఎరువుల లభ్యత పై వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రులు కింజారపు అచ్చన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఇరు శాఖలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. రెండు శాఖల ఉన్నతాధికారులతో సుధీర్ఘ చర్చ అనంతరం 2026-27 ఖరీఫ్ కు సంబందించిన షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఇప్పటికే కాలువల్లో తూడు, గుర్రపుడెక్క,పూడిక వంటి అత్యవసర పనులు చేపట్టడానికి 397 కోట్లతో పనులు జరుగుతున్నాయని, ఈ పనులు అన్నీ కూడా మే చివరి నాటికి పూర్తి చేయాలని ఇరువురు మంత్రులూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జూన్-1వ తేదీకి కాలువలకు నీటిని విడుదల చేస్తాం,కావున రైతులు సాగుకు సిద్ధంగా ఉండాలని అందుకు తగ్గట్లుగా ఇటు అధికారులు, అటు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో 99.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి గానూ, 888 టిఎంసిల నీటిని అందించామని, అదేవిధంగా 2025-26 రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలకు గానూ, 153 టిఎంసిల నీటిని అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్లలో 461 టిఎంసిల నీరు సాగునీటి వినియోగానికి అందుబాటులో ఉందని, సీఎం చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే, నేటికీ రిజర్వాయర్లలో ముందస్తుగానే నీటివిడుదలకు సరిపడా నీటినిల్వలు చేయగలిగాం అని పేర్కొన్నారు.
ఇరు శాఖల ఉన్నతాధికారులతో సుధీర్ఘ చర్చ అనంతరం ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు నీటి విడుదల పై షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇందులో పెన్నా డెల్టా కి ఇప్పటికే మే-4 వ తేదీ నుండి సాగు నీటిని విడుదల చేశామని, గోదావరి డెల్టాకు జూన్-1 వ తేదీ నుండి, గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్ఎస్ఎస్) కింద ఉన్న ఆయకట్టుకు జూన్-10వ తేదీ నుండి, టిజిపి కడప (ఎస్పీవీబీఆర్ కడప) కు జూన్-15 నుండి సాగు నీటిని విడుదల చేస్తామని తెలిపారు.
ఉత్తరాంధ్రలోని వంశధార ఆయకట్టుకు జూన్-15వ తేదీ నుండి, తోటపల్లి ఆయకట్టుకు జూలై-1 నుండి, కృష్ణా డెల్టా ఆయకట్టుకు జూలై-1వ తేదీ నుండి, ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూలై-10 నుండి, కేసి కెనాల్, తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, టిబిపిఎల్ఎల్సి, తాడిపూడి, పుష్కర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు కు జూలై-15 నుండి, టిబిపిహెచ్ఎల్సి కింద ఉన్న ఆయకట్టుకు జూలై-20 నుండి, హంద్రీనీవా సుజలస్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ఆయకట్టుకు జూలై-31 నుండి, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద జోన్-1 (పల్నాడు, గుంటూరు, బాపట్ల) కు జూలై -31 న, జోన్-2 (ప్రకాశం, మార్కాపురం) ఆయకట్టుకు ఆగష్టు చివరి వారంలో సాగునీటి విడుదల చేయనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శశిభూషణ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఎన్సీ నరసింహమూర్తి, మరియు ఇరు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News