-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో సేకరించే వ్యర్ధాలు కేవలం వ్యర్ధాలు మాత్రమే కావని, అవి నగరానికి సంపదని వ్యర్ధాల నుంచి సంపద తయారీకి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, పటమట, ఎలక్ట్రిసిటీ కాలనీ, యనమలకుదురు రోడ్ ప్రాంతాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణ, తడి చెత్త సేకరణ మరియు వర్మీ కంపోస్ట్ తయారీ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సేకరించే వ్యర్థాలను మూలస్థాయిలోనే తడి, పొడి చెత్తగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా తడి చెత్తను వర్మీ కంపోస్ట్ రూపంలో ఎరువుగా మార్చే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
పటమట, ఎలక్ట్రిసిటీ కాలనీ లో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ యూనిట్లను పరిశీలించిన కమిషనర్, తడి చెత్త ద్వారా తయారవుతున్న సేంద్రియ ఎరువును విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పార్కులు, రహదారి పక్కన ఉన్న మొక్కలు మరియు ఇతర హరిత ప్రదేశాలలో వినియోగించాలని సూచించారు. ఈ విధంగా మొక్కల సంరక్షణతో పాటు వాటి పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందించి నగరాన్ని మరింత హరితవనంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రజల్లో సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని, మొక్కల పెంపకంలో భాగస్వామ్యమవుతున్న స్వచ్ఛంద సంస్థలు (NGOs) మరియు ప్రజలకు తక్కువ ధరలకే ఈ ఎరువును అందుబాటులో ఉంచే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వర్మీ కంపోస్ట్కు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించి, అది విజయవాడ నగరపాలక సంస్థ తయారు చేస్తున్న సేంద్రియ ఎరువుగా ప్రజలకు సులభంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తదుపరి పటమట లో గల అన్న క్యాంటీన్ ను పరిశీలించి, పారిశుధ్య నిర్వహణ త్రాగునీటి సరఫరా వాడుక నీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే. షమ్మీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News