-బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశం
-మీడియా కథనాలపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే మీడియా కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. బాధిత మహిళను సురక్షితంగా భారత్కు తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కువైట్కు వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తుండగా, ఉద్యోగ వీసా కల్పించకుండా ఏజెంట్లు నిర్లక్ష్యం చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు, సోషల్ మీడియా ద్వారా బాధితురాలు సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. స్వదేశానికి తిరిగి పంపించాలని కోరితే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ఏపీ ఎన్ఆర్టీ వెంటనే స్పందించి, కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నిస్తోంది. అదేవిధంగా సంబంధిత ఏజెంట్ల పాత్రపై విచారణ చేపట్టాలని, అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, చంద్రగిరి పోలీస్ స్టేషన్ అధికారులు కూడా భాగ్యవతి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, భాగ్యవతి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చే వరకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News