– ఫీడ్, సీడ్ నాణ్యతపై కఠిన పర్యవేక్షణ : మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రింప్ ఫీడ్ ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయభారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రైతులు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారులు, పరిశ్రమ ప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వం సమగ్రంగా విన్నదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో ఫీడ్ ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో ఫీడ్ పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, పరిశ్రమ నిలదొక్కుకునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్, సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, CCTV ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసబిలిటీ, IoT ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. GM సోయా దిగుమతులు, ఫిష్ మీల్ లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఫీడ్ పరిశ్రమ స్థిరత్వం, ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, అన్ని భాగస్వామ్యులు పరస్పర సహకారంతో ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్, అధికారులు, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమరెడ్డి, AAC సభ్యులు, APSADA సభ్యులు, రైతు సంఘాలు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘాలు, పరిశ్రమ ప్రతినిధులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News