– జాయింట్ వెంచర్గా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు
– ఔత్సాహిక భూయజమానులకు గొప్ప అవకాశం
– ఈ చొరవలో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలి
– జిల్లాల కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని.. పెట్టుబడులను, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తోందని.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ పారిశ్రామిక వాడల అభివృద్ధికి చొరవచూపుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. పారిశ్రామిక వృద్ధిని పరుగులు పెట్టించేందుకు వీలుగా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన స్థలాన్ని కేటాయించేందుకు జాయింట్ వెంచర్ విధానంలో ప్రభుత్వం.. ప్రైవేటు భూయజమానులతో కలిసి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారమిక్కడ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త చొరవ భూయజమానులకు గొప్ప అవకాశమన్నారు. వనరులు, అవకాశాలు, నైపుణ్యమున్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోందని.. పెద్దఎత్తున ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశానికి అనుగుణంగా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని ప్రైవేట్ రంగంలోని భూ యజమానులతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం డెవలపర్గా వ్యవహరించి, ఆ భూమిలో పరిశ్రమలకు అవసరమైన అన్నిమౌలిక వసతులు కల్పించి పారిశ్రామిక పార్కుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్కును ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కులకు అదనంగా అందుబాటులోకి వచ్చే కొత్త జాయింట్ వెంచర్ పారిశ్రామిక పార్కులు నవతరం, యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప వరమని.. ఈ ప్రయత్నం భూయజమానులకు కూడా మంచి అవకాశమన్నారు. జిల్లాలో ఆసక్తి కలిగిన భూయజమానులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇన్వెస్టర్ డెస్క్ ఇన్ఛార్జ్ అధికారి, జిల్లాపరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ (98857 29555)ను వ్యక్తిగతంగా లేదా ఫోన్ద్వారా సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News