– ఉపాధి హామీ శ్రామికులతో చేయికలిపిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
– జిల్లాలో విజయవంతంగా జలధార కార్యక్రమం
– 445 చెరువుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
– రూ. 87 కోట్ల ఉపాధి నిధుల అనుసంధానంతో 1,300 పనులు
– భూగర్భ జలాల వృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి
– మండల, గ్రామ స్థాయి కమిటీల నిరంతర పర్యవేక్షణ
– పర్యావరణ పరిరక్షణకు, ఆర్థిక అభివృద్ధికి టీమ్ ఎన్టీఆర్ చొరవ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జలవ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం కోసం చేపడుతున్న జలధార-జలహారతి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని.. జలవనరుల సంరక్షణను కేవలం అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా భవిష్యత్ తరాలకు భద్రమైన పర్యావరణాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు జోడిచింతల చెరువులో శుక్రవారం జరుగుతున్న జలధార-జలహారతి పనులను కలెక్టర్ లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. తానుకూడా పలుగు పారపట్టి చెరువు పనిలో భాగస్వామిగామారి ఉపాధి శ్రామికులను ప్రోత్సహించారు. శ్రామికులతో కలిసి భోజనం చేస్తూ క్షేమసమాచారాన్ని తెలుసుకున్నారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికులకు అందుతున్న వేతనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం దార్శనికత, దిశానిర్దేశానికి అనుగుణంగా జిల్లాలో జలధార కార్యక్రమాలను చేపట్టామని… జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి, దశల వారీగా పనులు చేపడుతున్నామని తెలిపారు. వీటి పూర్తిస్థాయి సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం వీటి సామర్థ్యం 5.5 టీఎంసీలు మాత్రమేనని.. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చెరువులను పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న చెరువులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. చెరువుల పూడిక తొలగింపు, నీటి నిల్వ సామర్థ్య పెంపు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ, గట్ల నిర్మాణం, చెరువు కట్టల బలోపేతం వంటి పనులను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు.
జిల్లాలో జలధార కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో రూ. 87 కోట్లతో చేపట్టేందుకు 1,300 పనులను గుర్తించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయన్నారు.
ఫీడర్ ఛానళ్లు, ఎగ్జిట్ కెనాళ్ల అభివృద్ధికి, అనుసంధానానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
ఆర్థిక వృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు:
చెరువుల పునరుద్ధరణ ద్వారా వర్ష జలాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం పెరగడంలో గణనీయ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. దీని వల్ల వ్యవసాయానికి నీటి అందుబాటు మెరుగుపడటంతో పాటు తాగునీటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పారు. జలధార కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటైన కమిటీలు చెరువుల పరిరక్షణ, పనుల పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయని తెలిపారు. అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపల పెంపకం, పశుసంవర్ధక రంగం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు కూడా ఈ కార్యక్రమం మేలు చేస్తోందని తెలిపారు. ఈ విధంగా జలధార-జలహారతి కార్యక్రమం ద్వారా డ్వామా, ఇరిగేషన్, అటవీ, భూగర్భ జలవనరులు తదితర శాఖల అధికారుల సమన్వయంతో టీమ్ ఎన్టీఆర్ కృషిచేస్తోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, డీఎఫ్వో జి.సతీష్, ఎంపీడీవో డి.శకుంతల, ఏపీవో ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News