విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ అన్నారు. పింఛన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి నివాసాల వద్దనే సకాలంలో పింఛన్లు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నగరపాలక సంస్థ మూడు సర్కిళ్ల పరిధిలో మొత్తం 64,967 పింఛన్లకు గాను 53,946 పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని, ఇది సుమారు 85 శాతం పంపిణీకి సమానమని పేర్కొన్నారు. మిగిలిన పింఛన్ల పంపిణీని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు.
పింఛన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల ఆధార్ వివరాలను పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా ధృవీకరణ చేపట్టి నగదు అందజేస్తున్నట్లు తెలిపారు. పింఛన్లు ప్రతి నెలా సకాలంలో అందుతున్నాయా లేదా, సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అనే అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయోజనాలు అందేలా నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, సకాలంలో నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News