-యాంటీ మలేరియా మాసం-2026 సందర్భంగా 25వ డివిజన్లో అవగాహన ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు యాంటీ మలేరియా మాసం-2026 కార్యక్రమాలలో భాగంగా నగర పరిధిలో గల అన్ని డివిజన్లో మలేరియా మరియు ఇతర దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే.అర్జునరావు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన ర్యాలీని బయాలజిస్ట్ సత్యనారాయణ నిర్వహించారు. మంగళవారం ఉదయం 25 వ డివిజన్ మారుతి నగర్ లో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బయాలజిస్ట్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించాలని, నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి శుభ్రపరచాలని సూచించారు. అలాగే వాడని టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు వంటి దోమల పెరుగుదలకు అనుకూలంగా ఉండే వస్తువులను తొలగించాలని కోరారు. దోమల కాట్ల నుంచి రక్షణ కోసం దోమతెరలు, రిపెల్లెంట్లు వినియోగించాలని వివరించారు.
ఈ ఏడాది యాంటీ మలేరియా మాసం థీమ్ అయిన “మలేరియాకు ముగింపు – ఇప్పుడు మనం చేయగలం, తప్పక చేయాలి” అనే సందేశాన్ని ప్రజలకు వివరించి, వెక్టర్ జనిత వ్యాధుల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. మలేరియా నిర్మూలన లక్ష్య సాధనకు ప్రతి కుటుంబం పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాలని, పరిసరాలను స్వచ్ఛంగా ఉంచడం ద్వారా దోమల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని మలేరియా రహిత, దోమల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి పరిశుభ్రత పాటించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో సిబ్బంది, ప్రజారోగ్య విభాగం సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని మలేరియా నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
Prajavartha Online Telugu News