– మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతంగా చేపడదాం
– ప్రతి శాఖా ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 2047 నాటికి హరిత విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సమష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరముందని.. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం వర్చువల్గా అటవీ, డ్వామా, వ్యవసాయం, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల భూములు, సంస్థల భూములు, రహదారులు, రైల్వే లైన్లు, కాలువల వెంట మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇందుకు ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల అమలును వేగవంతం చేయాలని సూచించారు. దాదాపు 40 లక్షల మొక్కలను సమీకరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నర్సరీల సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన మొక్కల రకాలను ముందుగానే గుర్తించడం, సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పనుల అమలును వేగవంతం చేయాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ, పచ్చదనం పెంపు ఉద్యమాన్ని ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా అటవీ అధికారి జి.సతీష్, డ్వామా పీడీ ఎ.రాము, డీపీవో పి.లావణ్యకుమారి, డీఈవో ఎల్.చంద్రకళ, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News