-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల సమావేశ మందిరంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు ఆధ్వర్యంలో ప్రజారోగ్య శాఖ అధికారులతో, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ నుండి కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో నగర పారిశుద్ధ్య నిర్వహణ, శానిటేషన్ కార్యకలాపాలు, మానవ వనరుల వినియోగం, పారిశుద్ధ్య వాహనాల పనితీరు, డోర్-టు-డోర్ చెత్త సేకరణకు సంబంధించిన మైక్రో పాకెట్ మ్యాపింగ్, లాజిస్టిక్ మ్యాపింగ్, చెత్త ఉత్పత్తి మరియు సేకరణ వ్యవస్థ, లోడర్ పాయింట్లు, కాంపాక్టర్ బిన్ల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి వార్డు పరిధిలో పారిశుద్ధ్య సేవలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన, ఉప కాలువల పూడికతీత పనుల పురోగతిని సమీక్షించారు. వర్షపు నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అలాగే నగరంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (GTS) పనితీరు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 అమలు స్థితి, చెత్త సేకరణ మరియు తరలింపు ప్రక్రియలను సమీక్షించారు. వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ నగర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (VBDCP) కింద చేపడుతున్న దోమల నివారణ చర్యలు, యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
పశువైద్య విభాగం నిర్వహిస్తున్న కార్యకలాపాలు, వీధి జంతువుల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన చర్యలపై కూడా చర్చించారు. నగరంలో ప్రజారోగ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాల నాయక్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News