అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నగర అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా, అమరావతి జోనింగ్ నిబంధనల అమలులో భాగంగా APCRDA అధికారులు శనివారం ఆక్రమణల తొలగింపుకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో నిర్వహించారు.
డ్రైవ్లో భాగంగా రహదారులు, ఫుట్పాత్లు, ప్రభుత్వ భూములపై ఉన్న అనధికార ఆక్రమణలను గుర్తించి తొలగించారు. ప్రజల రాకపోకలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న కంటైనర్లు, తాత్కాలిక షెడ్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితర నిర్మాణాలను APCRDA సిబ్బంది, సంబంధిత శాఖల అధికారుల సహకారంతో తొలగించారు.
ప్రజా భద్రత, ప్రణాళికాబద్ధమైన అమరావతి నగర అభివృద్ధి దృష్ట్యా అమలులో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అనధికార ఆక్రమణల తొలగింపుతో వాహనాల రాకపోకలు మరింత సులభంగా మారతాయన్నారు. అమరావతి నగర పరిధిలో నిబంధనల మేరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని..కంటైనర్లు, షెడ్లు, ఇతర శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేయడం అనుమతించబడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, రహదారుల రైట్ ఆఫ్ వే, ఇతర పబ్లిక్ స్థలాలను ఆక్రమించరాదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఎలాంటి అనధికార ఆక్రమణలు గుర్తించినా, ముందస్తు నోటీసు లేకుండానే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Prajavartha Online Telugu News