-సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం
-రైతులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
-6 నెలల్లో 26.46 లక్షల పాస్ పుస్తకాలు రైతులకు అందజేత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు కొత్త పుస్తకాలను అందిస్తోంది. రైతుల సమక్షంలోనే రీ సర్వే చేసి వారి ఆమోదంతో పాస్ పుస్తకాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెలా మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నేరుగా ఆయనే రైతులతో సమావేశమై వారి సమక్షంలోనే అధికారులతో భూమి వివరాలను చదివించి పుస్తకాలను అందజేస్తున్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం వారితో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
ఆరు నెలల్లో 26.46 లక్షల పాస్ పుస్తకాలు అందజేత
జనవరి నుంచి ప్రభుత్వం రీ సర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తోంది. ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీ-సర్వే నిర్వహించింది. అందులో 6,459 గ్రామాలకు చెందిన 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. వచ్చే 9 నెలల్లో మరో 10,357 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం విధించారు. ఈ గ్రామాలకు సంబంధించి మొత్తం 67.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారి బ్లాక్చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రతీ భూ యూనిట్కు శాశ్వత బ్లాక్చైన్ ఐడీ ఇస్తోంది. దీని వల్ల ఒకసారి నమోదైన సమాచారాన్ని ఎవరూ మార్చడానికి అవకాశం ఉండదు. భూముల సర్వే ప్రారంభం నుంచి తుది రికార్డు వరకు ప్రతి దశలో ఈ-కేవైసీ తప్పని సరి చేసింది. తొలుత రైతుకు డ్రాఫ్ట్ పుస్తకాన్ని అందించి… రైతు తన వివరాలను పరిశీలించుకుని ఈ-కేవైసీ ద్వారా ధృవీకరించిన తర్వాతే తుది పాస్ పుస్తకం ముద్రణకు వెళ్తోంది.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 10.25 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చేరుకుంటారు. 11.15 గంటలకు మీ భూమి – మీ హక్కు ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 02.30 గంటలకు రైతులతో సమావేశమవుతారు. 03.15 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను ముగించుకుని సాయంత్రం 05.35 గంటలకు అమరావతి చేరుకుంటారు.
Prajavartha Online Telugu News