-అధికారులను ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-పీసీబీ అందించిన ల్యాబ్ రిపోర్టుపై సమీక్ష సమావేశం
-అనుమతించదగిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తింపు
-ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు
-నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉప ముఖ్యమంత్రి ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర గోదావరి నదిని పారిశ్రామిక రసాయనాలు, నగర మురుగు నీరు ఎంత దారుణంగా కలుషితం చేస్తున్నాయో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారులు అందించిన ల్యాబ్ రిపోర్టులో వెలుగు చూశాయి. గత నెల మే 25న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా బోటుపై వెళ్లి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్స్ (మడుగులు) వద్ద సేకరింపజేసిన నీటి నమూనాల పరీక్షా ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో జరిపిన ఈ పరీక్షలలో, అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధిక రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ నివేదికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సోమవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
గోదావరి నదిని మురుగుమయం, రసాయనమయం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, కళ్ళ ముందే గోదావరి నది ఇంతలా కలుషితమవుతున్నా, ఇన్ని రోజులుగా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేశారని అధికారులను ప్రశ్నించారు. అధికారులు చట్టపరంగా వాళ్లు చేయాల్సిన విధులను ఎందుకు నిర్వర్తించకుండా నిర్లక్ష్యం చేశారని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఆందోళనకర స్థాయిలో కోలిఫామ్ బ్యాక్టీరియా
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో గోదావరి నది నీరు మురుగునీటి వల్ల తీవ్రంగా కలుషితమైందని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా ఆందోళనకరమైన నిజాలు బయటపడ్డాయి. సాధారణంగా నది నీటిలో మనుషులు స్నానాలు చేయడానికి కోలిఫామ్ బ్యాక్టీరియా సంఖ్య 500 MPN/100ml లోపు ఉండాలి. కానీ నల్లా ఛానల్ సమీపంలోని కోటిలింగాల ఘాట్ తీరంలో ఇది ఏకంగా 2420 MPN/100ml కి చేరింది. నీటిలో కాలుష్యాన్ని చూపే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 3mg/L కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ అది 5.2 mg/L గా నమోదైంది. 73 శాతం పెరిగింది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి చేపలు, జలచరాలు చనిపోతున్నాయి. నీటి స్వచ్ఛత గరిష్టంగా 5 NTU పాయింట్లు ఉండాలి. కానీ పరీక్షల్లో ఇది 8.4 నుండి 14.2 NTU వరకు వచ్చింది. మురుగునీరు కలవడం వల్ల గోదావరి నీరు పూర్తిగా రంగుమారిపోతోంది. మురుగు కాలువలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 250 mg/L దాటకూడదు. కానీ ఇక్కడ 263 mg/L గా నమోదైంది. నీటిలో నైట్రేట్ పరిమితి 45 mg/L దాటకూడదు. కానీ ఇక్కడ ఏకంగా 119.6 mg/L గా తేలింది. రసాయన ఎరువుల అవశేషాలు, ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవడం వల్లే నైట్రేట్లు ఇంతగా పెరిగాయి. ఈ ల్యాబ్ నివేదిక ప్రకారం ఈ నీరు స్నానాలు చేయడానికి గానీ, గృహ అవసరాలకు గానీ ఏమాత్రం పనికిరాదు. ఈ నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నైట్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందక బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ముప్పు ఉందని నివేదిక హెచ్చరించింది.
పరిమితికి మించి ప్రమాదకర రసాయనాలు
ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్ వద్ద సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. నీటిలో సల్ఫైడ్, డివోబీ, ఫాస్ఫేట్లు పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడయ్యింది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 30 mg/L లోపు ఉండాలి. కానీ ఇక్కడ అది 36 mg/L ఉంది. 20 శాతం అధికంగా నమోదైంది. ఫ్యాక్టరీ వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్లే నీటిలో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోయి చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. నీటిలో ఫాస్ఫేట్ పరిమితి 5 mg/L ఉండాల్సి ఉండగా.. ఇక్కడ 5.3 mg/L గా తేలింది. నీటిలో సల్ఫైడ్ పరిమితి 2 mg/L మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏకంగా 3.4 mg/L ఉన్నాయి. 70 శాతం అధికారంగా నమోదైంది. ల్యాబ్ నివేదిక ప్రకారం ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న ఈ వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఈ నీటిని సరిగ్గా శుద్ధి చేయకుండా గృహ అవసరాలకు వాడటం మానవ ప్రాణాలకే అపాయమని నివేదిక హెచ్చరించింది.
తప్పులు సరిచేసుకోవడానికి మరో అవకాశం
ఆంధ్ర పేపర్ మిల్లు పరిసరాల్లోని లగూన్ వ్యర్థ జలాల ల్యాబ్ నివేదికలో కాలుష్య తీవ్రత నిర్ధారణ అయింది. చట్టప్రకారం ఈ నివేదిక ఆధారంగా సదరు ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయడానికి, ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయడానికి, అలాగే భారీగా జరిమానా విధించడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ పరిశ్రమల మనుగడను, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో ఆ పరిశ్రమకు మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే తప్పులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇచ్చారు. పరిశ్రమలను మూసివేసి కార్మికులను రోడ్డున పడేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, పర్యావరణ నిబంధనలను పాటిస్తూ నదిని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం తమ వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని, ల్యాబ్ నివేదికలో తేలిన లోపాలను యుద్ధప్రాతిపదికన సరిచేసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.
డీపీఆర్ సిద్ధం చేయండి
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఒక్క చుక్క మురుగునీరు కూడా శుద్ధి కాకుండా గోదావరిలోకి వెళ్లకూడదు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎంత మురుగునీరు వస్తోంది? భవిష్యత్తులో జనాభా పెరిగితే ఎంత వస్తుంది? అనే అంశాలపై పూర్తి సర్వే చేయాలి. మురుగునీటిని శుద్ధి చేయడానికి ఎన్ని ప్లాంట్లు అవసరమవుతాయి? ఎంత ఖర్చు అవుతుంది? సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి ప్రక్షాళనకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడతానని అన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ ఎస్. శరవణన్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News