విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ఏదో కారణం వల్ల చేయి పోగొట్టుకున్న వారికి తమ చేతితో పాటు వారి జీవనాధారం కూడా పోగొట్టుకోవడం చాలా విచారకరమైన విషయం. పేద కుటుంబాల వారు సొంతంగా కృత్రిమ చేయి పెట్టుకోలేరు. వారికి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉచితంగా పనికి ఉపయోగపడే విధంగా ఉండే కృత్రిమ చేయిని అందజేయనున్నారు” అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా IAS పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల వయస్సు పైబడ్డ వారు ఎవరైనా సరే చేయి కోల్పోయిన వాళ్ళు రెడ్ క్రాస్ అందజేయు ప్రోస్తటిక్ హ్యాండ్ ని పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆయన దీనికి సంబంధించిన పోస్టర్ ని ఎన్టీఆర్ కలెక్టరేట్ లో రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సమరం మాట్లాడుతూ ఉచిత ప్రోస్తటిక్ హ్యాండ్ కి రిజిస్టర్ చేయించుకున్నవారు ఒక్క పైసా కూడా ఎవరూ ఖర్చు చేయనవసరం లేదని, LN 4 కృత్రిమ చేతులు పూర్తిగా ఉచితంగా అందచేయబడతాయని అన్నారు. ప్రోస్తటిక్ హ్యాండ్ అవసరం అయిన వారు విజయవాడలోని ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో ఆగష్టు 5 లోగా రిజిస్టర్ చేసుకోవలసినదిగా కోరారు. పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి ఇ. చిట్టిబాబు, వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News