విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా జరిగింది. సోమవారం ధర్నాచౌక్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎ స్ లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. 108 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించడంతో పాటు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 108 ఉద్యోగ సంఘం నేతలతో చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, 108 సర్వీస్ కు ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. కోవిడ్ కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 108 ఉద్యోగులు పని చేశారని గుర్తు చేశారు. యూనియన్ నేతలు మాట్లాడుతూ జీవో 49 అమలును పునరుద్ధరించాలన్నారు. ఈ జీవోను రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర పని ఒత్తిడితో అనేక మంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వైద్యారోగ్య శాఖలోని అన్ని శాఖల్లో అమలు అవుతున్నట్టు 108 వ్యవస్థలోనూ రోజుకు మూడు షిప్టులల్లో షిప్టుకు 8 గంటల పని చొప్పున పని విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కిరణ్కుమార్, నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వివిధ ప్రాంతాల నాయకులు, 108 ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News