అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం బొర్రా గోపీమూర్తికి మండలి ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపి, శాసన మండలికి సంబంధించిన నియమ, నిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు కె.ఎస్. లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఉపాధ్యాయులు, నూతన ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News