మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ శనివారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ సమావేశ మందిరంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఆయా కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకుల నుంచి ఏక సభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు, అభిప్రాయాలు, సూచనలను జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ, జిల్లా ఎస్పీ, ఆర్. గంగాధర్ రావు, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షాహిద్ బాబు షేక్ ఇతర అధికారులతో కలసి స్వీకరించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తం 337 వినతులు, మెమోరాండాలను వివిధ షెడ్యూల్డ్ ఉప కులాల ప్రతినిధులు కమిషన్ కు అందజేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి సుమారు మూడు వేలమందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఎస్సీ ఉప కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, కులాల పునర్విభజనపై అందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను పూర్తిగా చర్చించి తదుపరి చర్యల నిమిత్తం కమిషన్ ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నందు అభిప్రాయాలు వినతులను సమర్పించేందుకు వచ్చే కుల సంఘాలు, ప్రజలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా నమోదు చేసి టోకెన్ల జారీ చేయటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి కే స్వాతి, డి.ఎస్.పి ఎండి. అబ్దుల్ సుభాన్, సహాయ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News