-ప్రజా సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలతో ప్రజాధరణ
-జీవిత కాల సభ్యత్వ నమోదు పత్రాన్ని అందచేస్తున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమ పథకాలు, పాలనా పరమైన సంస్కరణలు అమలు చేయడమే కాకుండా ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీయేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. మంగళవారం ఉదయం 12వ డివిజన్కు చెందిన కాట్రగడ్డ వెంకట నారాయణ ఆన్లైన్ ద్వారా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో లక్ష రూపాయలను చెల్లించి జీవిత కాల సభ్యత్వ నమోదును తీసుకున్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి వెంకటనారాయణను అభినందించి సభ్యత్వ నమోదు రశీదును అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామమోహన్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా అన్న నందమూరి తారక రామారావు పేదల కోసం ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే పాలనా పరంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. అలాంటి పార్టీలో తనకు సభ్యత్వం కలిగి ఉండటమే కాకుండా ఎమ్మెల్యేగా అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. టీడీపీలో సాధారణ సభ్యత్వంతో పాటుగా జీవిత కాల సభ్యత్వాలను తీసుకోవడానికి చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో పయనించేలా చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మనమందరం మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు పొట్లూరి సాయిబాబు, జాస్తి సాంబశివరావు, సుంకర విజయబాబు, జంపన శరత్ బాబు, లింగం మురళీ, రామ్మోహన్, కొడాలి శివాజీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News