గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యం కాపాడే కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు కూడా శ్రద్ధ చూపాలని, విధుల్లో తగిన రక్షణ పరికరాలు ధరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సూచించారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ స్వచ్చాంధ్ర ప్రదేశ్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టం (నమస్తే)లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజి (యూజిడి) కార్మికులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పిపిఈ) కిట్లను కమిషనర్ అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యూజిడి, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కార్మికులు నిత్యం ప్రమాదకర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిర్వహిస్తూ ప్రజారోగ్యానికి రక్షణగా నిలుస్తున్నారన్నారు. కార్మికులు ఆరోగ్య భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయన్నారు. నమస్తే పధకం ద్వారా కార్మికులకు పిపిఈ కిట్లు అందిస్తున్నారన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో యూజిడి కార్మికులు 121 మంది ఉండగా, వారిలో తొలుత 50 మందికి పిపిఈ కిట్లు అందించామని, ప్రస్తుతం మరో 70 మందికి సోమవారం అందిస్తున్నామని తెలిపారు. కిట్ లో ఫుల్ బాడీ సూట్, గమ్ బూట్లు, చేతి గ్లౌజులు, నిట్రైల్ మాస్క్, ఎన్-95 మాస్క్, సేఫ్టీ కళ్ళద్దాలు, హెల్మెట్ లు ఉంటాయని, కార్మికులు విధుల్లో తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించాలని సూచించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఈఈ సుందర్రామిరెడ్డి, నమస్తే స్కీం రాష్ట్ర కో ఆర్డినేటర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News