– రెవెన్యూ సదస్సుల అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– మండలస్థాయి సమన్వయ కమిటీలు క్రియాశీలంగా పనిచేయాలి
– జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 120 అర్జీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను నిర్దేశ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాల్సిందేనని.. రెవెన్యూ సదస్సుల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో కె.కన్నమ నాయుడు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 120 అర్జీలురాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 44, ఎంఏయూడీకి సంబంధించి 15, పోలీస్ 14, పంచాయతీరాజ్ 11, డీఆర్డీఏ ఏడు, విద్య 5, లీడ్ బ్యాంక్ మేనేజర్కు 4 అర్జీలు వచ్చాయి. వైద్య ఆరోగ్యానికి, మార్కెటింగ్ శాఖలకు మూడు చొప్పున రాగా ఎండోమెంట్స్, గృహ నిర్మాణ శాఖలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్ఆర్టీసీ, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, ఉపాధి కల్పన, మత్స్య, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ శాఖలకు ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయి. ఈ అర్జీలను నిర్దేశ గడువులోగా పరిష్కరించేందుకు కృషిచేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు మరింత క్రియాశీలంగా పనిచేయాలన్నారు. సమన్వయ శాఖల అధికారుల భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
Prajavartha Online Telugu News