గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సి.యం నగర పర్యటన సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుండే పర్యటన మార్గాలైన శ్రీ కన్వెన్షన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆర్.టి.ఓ ఆఫీస్ రోడ్డు, జె.కె.సి కాలేజి రోడ్డు, గుజ్జనగుండ్ల జంక్షన్, హనుమయ్య కంపెని వరకు పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, సి.యం పర్యటన ప్రాంతాలలో నగర పాలక సంస్థ చేపట్టిన పారిశుధ్యం, ప్యాచ్ వర్క్ లను, అనధికార బ్యానర్లు, హోర్డింగ్ ల తొలగింపును పరిశీలించి, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సిఎం పర్యటనలో నగర పాలక సంస్థ వైపు నుండి ఎటువంటి సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రణాళికాబద్దంగా తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది కేటాయించిన విధుల్లో సి.యం పర్యటన పూర్తి అయ్యే వరకు ఉండాలని ఆదేశించారు.
అనంతరం నగరంలోని చుట్టుగుంట సెంటర్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవానికి అల్పాహారం, భోజనాన్ని నామమాత్రపు ధరకే అందించేందుకే సంకల్పించి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.5తో పేదవారి ఆకలిని తీర్చడానికి అన్నా క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో చుట్ట గుంట, మిర్చి యార్డ్, నల్లచెరువు, పల్నాడు బస్టాండ్, ఆర్.టి.ఓ. ఆఫీస్, ఐడి హాస్పిటల్, బస్టాండ్ ప్రాంతాల్లోని 7 అన్న క్యాంటీన్లలో ప్రతి రోజు పేదలకు ఆహారం లభిస్తుందన్నారు. క్యాంటీన్ లో త్రాగునీరు, హ్యాండ్ వాష్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం చుట్టగుంట సెంటర్ లోని క్యాంటీన్ లో టిఫిన్ చేస్తున్న వారిని ఆహార నాణ్యతపై కమిషనర్ అడిగి తెలుసుకొని, వారు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
సదరు పర్యటనలో డిప్యూటి కమీషనర్ సి.హెచ్ శ్రీనివాసరావు, ఈ.ఈ కోటేశ్వర రావు, ప్రజారోగ్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News