గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ప్రతి కమర్షియల్ సంస్థకు డి&ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలని, ఫిబ్రవరి నెలాఖరుకు నూరు శాతం ట్రేడ్ ఫీజులు వసూళ్లు జరగాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సామవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, సెక్రెటరిలతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ ట్రేడ్ లైసెన్స్లు ఉండాల్సిన సంఖ్య కన్నా తక్కువగా ఉన్నాయని, నూతనంగా శానిటరీ డివిజన్ల పునర్విభజన చేసినందున ఇన్స్పెక్టర్లు తమ డివిజన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్స్ లు, రెన్యువల్ చేసుకున్నవి, నూతనంగా తీసుకోవాల్సి ఉన్నవాటి వివరాలను, డిమాండ్ నోటీసులను వార్డ్ సచివాలయాల వారిగా శనివారం నాటికి అందించాలన్నారు. శనివారం తర్వాత తమ క్షేత్ర స్థాయిలో పర్యటనలో ట్రేడ్ లైసెన్స్ లపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఎక్కడైనా ట్రేడ్ లైసెన్స్ లేకుండా, ఫీజులు చెల్లించకుండా కమర్షియల్ సంస్థలు ఉంటే సంబందిత కార్యదర్శిపై, పర్యవేక్షణ అధికారి అయిన ఇన్స్పెక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నగరంలో పారిశుధ్య విభాగ పనితీరులో మార్పు రావాలని, రోడ్ల మీద వ్యర్ధాలు, డెబ్రిస్ తొలగించాలన్నారు. ఉదయం మస్టర్ ఆనంతరం మెయిన్ రోడ్లు శుభ్రం, ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ చేపట్టాలన్నారు. ఇప్పటికే నూతనంగా డంపర్ బిన్లను, పుష్ కాట్స్ ని అందించామని, డివిజన్ల వారీగా అవసరం మేరకు అదనపు ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు. 802 మైక్రో ప్యాకేట్స్ వారీగా మెరుగైన పారిశుధ్యం కోసం కృషి చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిని విధుల నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సూపర్వైజర్ల పేరుతో ఏ ఒక్క ప్రజారోగ్య కార్మికుడు ఉండడానికి వీలులేదన్నారు. ప్రజారోగ్య విభాగం నుండి అందించే సేవలు నిర్దేశిత గడువులోగా అందించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, ఇన్స్పెక్టర్ల పై నివేదిక ఇవ్వాలని శానిటరీ సూపర్వైజర్లను ఆదేశించారు. రోడ్ల మీద ఆవులు, ఎద్దులు ఉండడానికి వీలు లేదని, వాటిని పట్టుకొని జిఎంసి గోశాలకు తరలించాలన్నారు. డివిజన్ల వారీగా కార్మికుల హాజరు, లీవుల రిజిస్టర్లు మెయిన్టైన్ చేయాలని, సెలవు చీటీ ఇచ్చిన తర్వాతనే సెలవు మంజూరు చేయాలన్నారు. ఎంహెచ్ఓ, సిఎంహెచ్ఓ ప్రజారోగ్య విభాగ పనితీరును ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనితీరు మెరుగయ్యేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
సమావేశంలో సిఎంఓహెచ్ఓ డాక్టర్ పిజె అమృతం, వెటర్నరీ సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎంహెచ్ఓ రవిబాబు, ఏఎంహెచ్ఓలు ఆనందకుమార్, రాంబాబు, శానిటరీ సూపర్వైజర్లు ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, ప్రజారోగ్య విభాగ సూపరిండెంట్ పోలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
