మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యాపార సంస్థలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకాంక్షించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మందిరంలో జిల్లాలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంస్థలోని సీఈవోలు, బోర్డు డైరెక్టర్లు, సభ్యులకు వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, సూక్ష్మ సేద్యం, నాబార్డ్, బ్యాంకర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత శాఖల అధికారులు వివరిస్తున్న పథకాలపై అవగాహన ఏర్పరచుకుని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. సంస్థలోని ప్రతి రైతు వ్యాపారవేత్తగా ఎదిగేందుకు ఆలోచన చేయాలని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డైరీ ఉత్పత్తుల్లో అమూల్ వంటి సంస్థలు చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన నేపథ్యాన్ని ఆయన వివరిస్తూ ప్రస్తుతం ఉన్నన్ని పథకాలు గతంలో లేవని, అయితే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎదిగేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నాయని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ఎన్ పద్మావతి, జై జ్యోతి, డి ఆర్ డి ఎ పి డి సాయిబాబు, నాబార్డ్ బ్యాంక్ ఏజీఎం మిలింద్ చౌసాల్కర్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, డి సి ఓ కే చంద్రశేఖర్, ప్రకృతి వ్యవసాయ డిపిఎం పార్థసారథి, బాపట్ల వ్యవసాయ క్షేత్రం శాస్త్రవేత్త వాసుదేవరావు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిడి విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News