-పోలింగ్ ఏర్పాట్ల వివరాలను తెలియజేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ డీకే బాలాజీ సహాయ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ కే చంద్రశేఖర రావు తో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, ఇతర అంశాలను వివరిస్తూ…. కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిధిలో 63,114 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. ఈనెల 27వ తేదీ గురువారం జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లాలో 63,114 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఓటర్లకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.పోలింగ్ కు 48 గంటల ముందుగా సైలెంట్ పిరియడ్ అమల్లోకి వస్తుందని, సెక్షన్ 144 అమల్లోకి వస్తుందని, ఆ సమయంలో ఎటువంటి ప్రచారాలూ చేయరాదని పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెండ్ పిరియడ్ ఉంటుందని స్పష్టం చేశారు.
77 పోలింగ్ కేంద్రాల్లో ఓటెయ్యనున్న 63,114 మంది
జిల్లాలో 31 లొకేషన్స్ లో 77 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా 477 మంది అధికారులను, సిబ్బందిని కేటాయించామని వివరించారు. వీరిలో 94 మంది ప్రిసైడింగ్ అధికారులు, 92 మంది ఏపీవోలు, 199 మంది ఓపీవోలు ఉన్నారని తెలిపారు. వీరితో పాటు 92 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా ఉంటారని తెలిపారు. జిల్లా పరిధిలో మొత్తం 63,114 మంది ఓటర్లు ఉన్నారని వారిలో 35,321 మంది పురుషులు, 27,789 మంది మహిళలు,4 గురు థర్డ్ జెండర్స్ ఉన్నారన్నారు. 77పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. మార్చి 03వ తేదీన గుంటూరులో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని స్పష్టం చేశారు.
మూడు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు
పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేసేందుకు అనువుగా జిల్లా పరిధిలో మచిలీపట్నం నోబుల్ కళాశాల, గుడివాడ,ఉయ్యూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయా లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. 26వ తేదీ ఉదయం నుండి పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ అందజేస్తారని చెప్పారు. అలాగే 27వ తేదీ సాయంత్రం పోలింగ్ సిబ్బంది నుంచి రిసెప్షన్ కేంద్రం వద్ద మెటీరియల్ స్వీకరిస్తారని పేర్కొన్నారు. మెటీరియల్ ను, సిబ్బందిని తరలించేందుకు అనువుగా తగినన్ని వాహనాలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అన్ని జిల్లాలకు తగినంత మెటీరియల్ సిద్ధం చేశామని పేర్కొన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగినంత మందిని నియమించామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ఏజెంట్లు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రం లోపలికి సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోలింగ్ నిర్వహించే జిల్లాలోని 77 పోలింగ్ కేంద్రాలలో ఉన్న విద్యాసంస్థలకు ఈనెల 26, 27వ తేదీ రెండు రోజులు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లుగా నమోదైన పట్టభద్రులు ఓటు వేసేటప్పుడు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో 1,2,3 సూచిస్తూ బ్యాలెట్ పేపర్లో నమోదు చేయాలన్నారు. ఓటరు పోలింగ్ స్టేషన్ కు వచ్చేటప్పుడు సాధారణ ఓటరు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని లేనియెడల ఆధార్ కార్డ్ ,డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్టు,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు లేదా ఇతర ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడిన సేవా గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు. సంబంధిత ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ల నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఉద్యోగంలో ఉన్న విద్యాసంస్థల చేజారీ చేయబడిన సేవా గుర్తింపు కార్డు, యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్, కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన ఫిజికల్ హ్యాండీక్యాప్ ఒరిజినల్ సర్టిఫికెట్, భారత ప్రభుత్వం సామాజిక న్యాయం & సాధికారిక మంత్రిత్వ శాఖ వారిచే జారీ చేయబడిన ప్రత్యేక వైకల్యం ఐడి కార్డ్, వంటి పది రకాల గుర్తింపు పత్రాలను తీసుకురావచ్చునని కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు. ఓటర్ గా నమోదైన పట్టభద్రులు ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
Prajavartha Online Telugu News