-పింఛన్లు క్రమం తప్పకుండా ఇంటి వద్దనే అందిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా పెద్ద ఎత్తున పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేసి పేద వారికి అండగా నిలుస్తోందని, ప్రభుత్వం పట్ల పలువురు పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, జిల్లాలో ఈ మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను 2,62,461 మంది ఫించన్ దారులకు సుమారు 112.06 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.
శనివారం ఉదయం వేదాంతపురం నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. అలాగే పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. వారు ఫించన్ లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని ఫించన్ తమకు ఎంతగానో ఆసరాగా ఉందని కలెక్టర్ కు తెలిపారు. వేదాంతపురం గ్రామ పంచాయితీ నందు భాగ్యమ్మ కు, సి. నరసమ్మ లకు వృద్ధాప్య పెన్షన్ రూ.4000 వంతున, సి. కులదీప్ విభిన్న ప్రతిభావంతునికి దివ్యాంగుల పెన్షన్ రూ.6000 ను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందచేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు పిడి, డిఆర్డిఎ – వెలుగు ప్రభావతి, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి మరియు డిఎల్డిఓ తిరుపతి నారాయణ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపిడిఓ రామచంద్ర, సచివాలయం సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News