-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు మత పెద్దలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో సోమవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మైనారిటీ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. సర్వమతాల సారాంశం ఒక్కటేనని.. ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్థనలు, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
మైనారిటీలతో వైసీపీకి బలమైన అనుబంధం
మైనారిటీలతో వైసీపీకి బలమైన అనుబంధం ఉన్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. దేశంలోనే మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పుకొచ్చారు. మైనార్టీల అభ్యున్నతికై ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ తో ఈ రోజున రాష్ట్రంలో ముస్లింలందరూ విద్య, వైద్య రంగాల్లో రాణించి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. మరలా 2019 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైనార్టీ యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించినట్లు వివరించారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఉర్దూ పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. 2014-19 మధ్య తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చుచేసింది కేవలం రూ. 2,665 కోట్లు మాత్రమేనని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అక్షరాలా రూ. 23,176 కోట్ల మేర లబ్ది చేకూర్చినట్లు వివరించారు. ఆనాడు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా చంద్రబాబుకు మనసు రాలేదని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి గౌరవించుకోవడం జరిగిందన్నారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన సబ్ప్లాన్కు చట్టబద్దత కల్పించడం జరిగిందన్నారు. ఇమామ్లు, మౌజమ్లకు ఇచ్చే గౌరవ భృతిని గత చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెడితే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించడమేకాక పెంచిన గౌరవ భృతిని అందించిందన్నారు. ఉర్దూ భాషకు గుర్తింపు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర ప్రారంభమైందని మాట్లాడారు. అలాగే వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా మైనార్టీ కుటుంబాలలో వివాహానికి ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత వైసీపీ ప్రభుత్వ పథకాలను రద్దు చేసి.. మైనారిటీలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News