మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. అదేసమయంలో నేను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో ఉండటం జరిగింది. ఇటువంటి సంఘటన జరగడం పట్ల ఎంపి బాలశౌరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఉగ్రవాద దాడిలో తెలుగురాష్ట్రాలకు చెందిన జెఎస్ చంద్రమౌళి మరియు మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు మా జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. పౌరులపై ఉగ్రదాడులు మానవత్వానికి మాయని మచ్చ. ఇటువంటి పిరికిపంద చర్యలకు భారతదేశం భయపడదు. ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో భద్రతా లోపాలు ఉన్నట్లు ఈ దాడి సూచిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని, భద్రతా బలగాలను ఆయా ప్రాంతాలలో పెంచాలని కోరారు.
భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అవసరం అయితే సైన్యం సహాయం కూడా తీసుకొని ఉగ్రవాదులకు సరైన గుణ పాఠం నేర్పాలని సూచించారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి సమగ్ర చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఉగ్రవాదులను ఏరి పారవేయాలని అభిప్రాయపడ్డారు..
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జమ్మూ కాశ్మీర్లోని పహాల్గామ్లో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారత పౌరులకు ,సంతాపం తెలుపటం కోసం జనసేన శ్రేణులు అందరూ కొవ్వొత్తుల ర్యాలిని పెద్ద ఎత్తున రేపు సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలో నిర్వహిస్తున్నామని, ఇందులో అందరూ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News