మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోని అవధూత దత్త పీఠం వారు ఇటీవల నిర్వహించిన భగవద్గీత పోటీ పరీక్షలలో బందరువాసులు ఘంటసాల మహాలక్ష్మి, ఘంటసాల ఉమాదేవి పాల్గొని అఖండ విజయం సాధించి, చెరొక బంగారు పతకాన్నిపొందారు. గత రెండు సంవత్సరాలుగా వారు కఠోర దీక్ష తో నిత్య సాధన చేసి భగవద్గీత లోని 18 అధ్యాయాలు, సమస్త శ్లోకాలు కంఠస్థం చేసారు. పరీక్ష సమయంలో నిర్వాహకులు అడిగిన అన్ని శ్లోకాలను వారు గడగడా చెప్పి బంగారు పతకాలను సాధించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నగరంలోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగిన యోగా శిక్షణ తరగతుల్లో యోగా గురువులు గురునాథ్ బాబు, చింతయ్య, రమేషు యోగ సభ్యులు అందరూ కలిసి విజేతలను పుష్పగుచ్చాలు, కాశ్మీరీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. విజేతలైన మహాలక్ష్మి, యోగ గురువులు గురునాథ్ బాబు సతీమణి కావడం చెప్పుకోదగ్గ విశేషం. ఆ బంగారు పతకాలను వచ్చే నెలలో పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామీజీ సువర్ణ హస్తాలతో విజేతలైన మహాలక్ష్మి, ఉమాదేవి అందుకోనున్నారు.
Prajavartha Online Telugu News