రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మానవ అక్రమ రవాణా, తప్పిపోయిన మరియు ఆచూకీ తెలియని పిల్లల కేసులు, మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మొదలగు అంశాల పై సంబంధిత అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు ముఖ్య కారణాల గురించి వివరించారు. వివిధ సామాజిక మాధ్యమాలలో అపరిచితులతో స్నేహాల వల్ల అక్రమ రవాణాకు గురవుతున్నారని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఇలాంటి నేరాలు తగ్గుతాయన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పిపోయిన పిల్లల ఆచూకీ అంత సులభంగా లభించదని, అలా తప్పిపోయిన పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని గుర్తుచేశారు. తప్పిపోయిన మరియు ఆచూకీ తెలియని పిల్లలు మరియు అక్రమ రవాణా గురవుతున్న బాధితులను కాపాడేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకోవలసిన చర్యలు ఏమిటి, అటువంటి బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ సేవల గురించి వివరించారు. నల్సా వారి “అక్రమ రవాణా బాధితులు మరియు వాణిజ్య పరమైన లైంగిక దోపిడీ బాధితుల పథకం, 2015” ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలిపారు. మానవ అక్రమ రవాణా, తప్పిపోయిన మరియు ఆచూకీ తెలియని పిల్లల సంబంధిత కేసుల లో ఉచిత న్యాయ సహాయం కొరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మహిళా పోలీసు స్టేషన్ డి.ఎస్.పి కె.వి.సత్యనారాయణ , జిల్లా పాఠశాల విద్యాధికారి కె.వాసుదేవ రావు, అసిస్టెంట్ కమిషనర్ ఒఫ్ లేబర్ బి.ఎస్.ఎన్. వల్లి , చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ పి. సూర్య ప్రభావతి, పోలీస్ అధికారులు ఆషా వర్కర్స్, ఏ. ఎన్. ఎమ్ లు, మహిళా పోలీసులు, పారా లీగల్ వాలంటీర్లు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News