
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు చదువుతోపాటు భవిష్యత్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకాన్ని స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలనే ఉత్సాహం తల్లిదండ్రుల్లో ఉండేది కాదని.. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో పెనుమార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అయితేనే తమ పిల్లలను చదివిస్తామనే స్థితికి చిన్నారుల తల్లిదండ్రులలో మార్పు వచ్చిందన్నారు. గత తెలుగుదేశం హయాంలో విద్యా సంవత్సరం సగం పూర్తయినా కూడా పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందేవి కాదన్నారు. కానీ నేడు తొలిరోజే అందిస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నేలా అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయన్నారు. ఇందులో భాగంగా పాఠశాల అభివృద్ధికి రూ. 60 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. అనంతరం హైస్కూల్ కు చెందిన 855 మంది విద్యార్థులతో పాటుగా.. ప్రైమరీ స్కూల్ కు చెందిన 475 మందికి జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీవైఈవో రవి, పాఠశాల హెడ్ మాస్టర్ మోహన్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ దేవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News