విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాపుల మనోభావాలకు ముడిపడి ఉన్న తుని రైలు దహన ఘటన పై నమోదైన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో సీనియర్ నాయకులు, పలు సంఘాల నాయకులు, రాధా రంగా మిత్ర మండలి ముఖ్య నాయకులు, ఉద్యమ జే ఏ సి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జే.ఏ.సి అధ్యక్షులు చందు జనార్దన్ మాట్లాడుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 10 శాతం ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలన్నారు. కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలన్నారు. కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహనరంగా నామకరణం చేయాలన్నారు. కాపుల సమస్యలను ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. వివిధ వర్గాలుగా ఉన్న కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలుకై న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే హరి రామ జోగయ్య లాంటి పలు కాపు సంఘాల నాయకులు న్యాయస్థానంలో రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తున్నారన్నారు. ఈ సమావేశం లో ఉద్యమ జే ఏ సి నాయకులు ముత్యాల రామదాసు, ఆకులశ్రీనివాస్, నీలిబండ్ల రాజు, కోటా శ్రీనివాస్, ఓతుకోలు మార్కండేయులు, రాధా రంగా మిత్రమండలి సుంకర సాంబశివరావు, ఎమ్. నాగేశ్వరరావు, గంటా సాయి వరప్రసాద్, కాపునాడు నాయకులు గాళ్ళ సుబ్రహ్మణ్యం, రాయలసేన ఈశ్వర్, రొక్కం శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News