విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ లోని ముత్యాలంపాడు అంబేద్కర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఆయన పర్యటించారు. గడప గడపకూ తిరిగి వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంతో అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగిందన్నారు. ప్రజాసమస్యల తక్షణ పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని విమర్శించడమంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుందన్నారు. తన సుధీర్ఘ పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను.. నవరత్నాలు, 2 పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచిన ముఖ్యమంత్రి జగనోహన్ రెడ్డి గారు దాదాపుగా అన్నీ అమలు చేస్తున్నారన్నారు. ఏయే పథకం ఏయే నెలలో అమలు చేస్తామో ముందుగానే సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి మరీ నెలకు మూడు నుంచి నాలుగు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. 31 వ డివిజన్ లో 1,229 మంది తల్లులకు అమ్మఒడి, 949 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక, 1,137 మందికి ఇళ్ల పట్టాలు, 308 మందికి చేయూత, 103 మందికి కాపునేస్తం, 464 మందికి జగనన్న తోడు, 126 మంది చేదోడు, 112 మందికి వాహనమిత్ర, 229 మందికి విద్యాదీవెన పథకాల రూపంలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. ఈ సంక్షేమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేస్తామన్నారు. నియోజకవర్గంలో రాబోయే 6 నెలల్లో 15వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శనంగా నిలిచాయని మల్లాది విష్ణు అన్నారు. పేదరిక నిర్మూలన, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను నీతిఆయోగ్ సైతం ప్రశంసించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఏకైక అజెండా అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, వీఎంసీ ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, వైఎస్సార్ సీపీ నాయకులు అంగిరేకుల విజయ్, మానం వెంకటేశ్వరరావు, జనార్థన్, బెజ్జం రవి, జయకర్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News