-శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వినాయక నిమజ్జన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం సత్యనారాయణపురం శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానములో శ్రీవరసిద్ధి వినాయక స్వామి మట్టి విగ్రహ నిమజ్జన కార్యక్రమం బుధవారం దేవాలయ ప్రాంగణములో వైభవోపేతంగా జరిగింది. పంచహారతులతో మంగళవాయిద్యాల నడుమ మహా వైభవముగా గోక్షీరము మరియు జలముతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మట్టిగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకై ఆలయంలోనే వినాయక నిమజ్జనం చేపట్టడం అభినందనీయమన్నారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా.. ఏ కార్యం చేపట్టాలన్నా తొలి పూజ వినాయకునితోనే మొదలవుతుందన్నారు. ఏ ఆలయానికి వెళ్లినా మొదట గణనాథుడినే దర్శించుకుంటామన్నారు. వినాయకుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు గారు అన్నారు. సకల విఘ్నాలు తొలగించే వినాయకుని అనుగ్రహం సదా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపైనా, నియోజకవర్గ ప్రజలపై ఇదే విధంగా కొనసాగాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, ఆలయ చైర్మన్ కొల్లూరు రామకృష్ణ, ఈవో యడ్లపల్లి సీతారామయ్య, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి దోనేపూడి శ్రీనివాస్, నాయకులు నాళం సురేష్, బంగారి, జె.కె.సుబ్బారావు, చాంద్, సుధీర్, చల్లా సుధాకర్, కూనపుడి ఫణి, టి.డి.వి.నాగలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News