విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని జంద్యాల దక్షిణామూర్తి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును డీఈఓ తెహరా సుల్తానా తో కలిసి ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్ రూమ్ను పరిశీలించారు. చిన్నారులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పట్టిక ప్రకారం రోజు వారీ మెనూను సంబంధింత ఉపాధ్యాయులు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. మెనూ అమలుపై వివరాలను జగనన్న గోరుముద్ద యాప్ లో హెచ్ఎంలు అప్ లోడ్ చేస్తే ఆ వివరాలు సీఎం డ్యాష్బోర్డులో కనిపిస్తాయని తెలిపారు. వాటి ఆధారంగా తాము పథకం అమలును సమీక్షిస్తామని పేర్కొన్నారు. మరోవైపు వంట కార్మికులకు పెండింగ్లో వున్న వేతనాలు వెంటనే విడుదల అయ్యేలా కృషి చేస్తానని మల్లాది విష్ణు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి బెవర నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.ఈ.ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News