-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 85 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంకు చెందిన కలిగినీడి కిరణ్ కుమార్ అనే వ్యక్తి గుండె శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధికి దరకాస్తు చేసుకోగా రూ.85 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఆంధ్రప్రభ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్ధిదారుకు అందజేశారు. పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 755 మందికి రూ. 3 కోట్ల 54 లక్షల 86 వేల 35 రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. 108 మందికి రూ. 2 కోట్ల 7 లక్షల 12వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసీలను అందజేసినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వాతావరణం ఉండేలా, రోగులకు మంచి భోజనం లభించేలా దృష్టి సారించారన్నారు. వైద్య రంగంలో కూడా నాడు–నేడు కింద అభివృద్ధికి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా.. ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపచేస్తున్నారన్నారు. ఈ పథకం కింద పేదలు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో వారి జీవనభృతికి ఇబ్బంది కలగకుండా ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ కింద రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5,000 ఇస్తున్నారన్నారు. 108, 104 సర్వీస్ వ్యవస్థ రూపు రేఖలు మార్చడంతో పాటు.. కొత్తగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణాల్లోని వార్డుల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
Prajavartha Online Telugu News