-స్వర్ణభారతి ట్రస్ట్, డా.పిన్నమనేని ఆసుపత్రులలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉపరాష్ట్రపతి నాలుగు రోజుల పర్యటన సందర్భంగాఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్ మరియు చిన అవుటపల్లిలోని డా. పిన్నమనేని ఆసుపత్రులలో ఏర్పాట్లను శుక్రవారం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన లో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 30వ తేదీ శనివారం ఉదయం 11 .30ని.లకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారని, అనంతరం అక్కడ నుండి బయలుదేరి ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకుంటారన్నారు. అదేరోజు సాయంత్రం నాలుగు నాలుగు గంటలకు స్వర్ణభారతి ట్రస్ట్ లో జరిగే రైతు నేస్తం మాసపత్రిక వార్షిక కార్యక్రమంలో పాల్గొని రైతులకు పురస్కారాలను అందిస్తారన్నారు. 31 వ తేదీ ఆదివారం విజయవాడలోని రామమోహన్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, తిరిగి స్వర్ణభారతి ట్రస్ట్ చేరుకుంటారన్నారు. నవంబర్ 1వ తేదీ సోమవారం చినఆవుటపల్లిలోని డా.పిన్నమనేని ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో, అధ్యాపకులతో ప్రసంగిస్తారన్నారు. 2వ తేదీ మంగళవారం ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరివెళతారన్నారు. రైతునేస్తాం కార్యక్రమంలో వివిద రాష్ట్రాల నుండి రైతులు పాల్గొనే అవకాశం ఉన్నందున, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ కి కూడా ఎటువంటి ఇబ్బందుకు లేకుండా చూడాలన్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో భద్రతపరమైన సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను స్వర్ణభారతి ట్రస్ట్ లో పోలీసు ఉన్నతాధికారులు భద్రతా సిబ్బంది ట్రయిల్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎల్.శివ శంకర్ ,డిసిపి విక్రాంత్ పాటిల్, నూజివీడు ఆర్డివో రాజ్యలక్ష్మి , ఏసిపి విజయపాల్, ఉంగుటూరు తహసీల్దార్ వనజాక్షి, ఎంపీడీఓ జ్యోతి , స్వర్ణభారతి ట్రస్ట్ డైరెక్టర్ పరదేసి, సిఐ శివాజీ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం చిన అవుటపల్లిలోని డా.పిన్నమనేని ఆసుపత్రి చేరుకుని ఉపరాష్ట్రపతి పాల్గొనున్న కార్యక్రమాల ఏర్పాట్లను అధికారులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మూర్తితో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షించారు.
Prajavartha Online Telugu News