అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణం మంజూరు చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు లోతేటి శివ శంకర్, పృథ్వి తేజ్ ఇమ్మడి, పి.పుల్లారెడ్డిలతో సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ.. వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణం ప్రజలకు సమాచారం అందించడంతో పాటు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నందున క్షేత్ర స్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సామగ్రి సంసిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్య పథకాలైన సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సూర్యఘర్ పథకం లో భాగంగా ఎస్సీ లబ్ధిదారుల లక్ష్యంగా పెట్టుకున్న 6 లక్షల కనెక్షన్లను జూలై నాటికి పూర్తి చేయడంతో పాటు ఇతర వర్గాలకు కూడా సోలార్ కనెక్షన్ల ను అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News