విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, క్రీడా ప్రాంగణాలు వంటి ప్రజా రద్దీ ప్రాంతాలలో వీధి కుక్కల సంచారం మరియు కుక్క కాట్ల నివారణపై సమీక్ష సమావేశాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఈ రోజు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO), జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), రైల్వే మరియు బస్టాండ్ నోడల్ అధికారులు, ప్రభుత్వాసుపత్రి ప్రతినిధులు, వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ప్రజారోగ్య అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రజల భద్రత, ముఖ్యంగా విద్యార్థులు, రోగులు, ప్రయాణికులు మరియు సాధారణ ప్రజల రక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని కమిషనర్ పేర్కొన్నారు. వీధి కుక్కలు ప్రజా సంస్థలలోకి ప్రవేశించకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
కమిషనర్ ముఖ్య ఆదేశాలు:
పాఠశాలలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర సంస్థల ప్రాంగణాలలో వీధి కుక్కలు ప్రవేశించకుండా గేట్లు, ఫెన్సింగ్ మరియు భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయాలి.
ప్రతి సంస్థలో నియమిత నోడల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలి.
ఆహార వ్యర్థాలను బహిరంగంగా వేయకుండా చర్యలు తీసుకోవాలి.
చెత్త బుట్టలను కుక్కలు చేరుకోలేని ఎత్తులో ఏర్పాటు చేయాలి.
ఆహార వ్యర్థాలను ప్రతిరోజూ సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్కు అప్పగించి సక్రమంగా తొలగించాలి.
భద్రతా సిబ్బంది ప్రవేశ ద్వారాల వద్ద నిరంతర పర్యవేక్షణ నిర్వహించి వీధి కుక్కల ప్రవేశాన్ని అరికట్టాలి.
ఆరోగ్య శాఖ అధికారులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ నిల్వలు, ప్రథమ చికిత్స సదుపాయాలు మరియు డాగ్ బైట్ కేసులపై PHCలతో సమన్వయం కొనసాగించాలి.
కమిషనర్ మాట్లాడుతూ, సంబంధిత సంస్థల ప్రాంగణాలలో వీధి కుక్కల ప్రవేశ నివారణ ప్రధాన బాధ్యత ఆయా సంస్థల యాజమాన్యం మరియు నోడల్ అధికారులదేనని స్పష్టం చేశారు. అవసరమైతే Vijayawada Municipal Corporation అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు.
ప్రజారోగ్యం మరియు ప్రజా భద్రత దృష్ట్యా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News