విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీ, రెడ్డిపాలెం, కాకుమానువారితోట తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలు తనిఖీ చేసి, తదుపరి అనుమతులకు సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. భవనాలు నిర్మాణ దశలోనే వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని స్పష్టం చేశారు. ప్రదానంగా సెట్ బ్యాక్ పోర్షన్ లో ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదని, జనరేటర్లు కూడా పెట్టడానికి వీలు లేదన్నారు. గ్రీనరీకి ప్లాన్ లో చూపిన విధంగా ఉండాలన్నారు. వాచ్ మెన్ రూమ్ నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ నిర్వాహకులే డ్రైనేజి లైన్ ను మేజర్ డ్రైన్ వరకు కనెక్ట్ చేసుకోవాలన్నారు. అనంతరం ఎల్ఆర్ఎస్ లకి సంబంధించి వివరాలు అడిగి త్వరగా పూర్తి చేయాలన్నారు. కాకుమానువారి తోటలో త్రాగునీటి కలుషిత ఫిర్యాదుని ఇంజినీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలించి, సమస్య ఉంటే తక్షణ చర్యలు తీసుకోవాలని, 3 వంతెనల వద్ద డ్రైన్ లో వ్యర్దాలు లేకుండా తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఏసిపీ రెహ్మాన్, డిఈఈ రమేష్, ఎస్ఎస్ సాంబయ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News