– గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం
– తెలంగాణ ఎన్నారై సలహా కమిటీతో మంత్రి కొండపల్లి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గల్ఫ్ వలసదారులు మరియు విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్నారై (NRI) విధానాన్ని రూపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ఎన్నారై సలహా కమిటీ.. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్నారై పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఏపీలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఈ బృంద సభ్యులు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ భవనంలో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రవాసాంధ్రుల కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ కార్యక్రమాలను మంత్రి కొండపల్లి వారికి వివరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన కార్యక్రమాలు చేపడుతోందని.. ఈ క్రమంలోనే ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకోసమే వచ్చినట్టు తెలంగాణ ఎన్నారై సలహా కమిటీ పేర్కొంది. ప్రసావాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం అందిస్తోన్న సేవలు, అత్యవసర సహాయక చర్యలు, విదేశాల్లో సురక్షిత ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఓఎంకాప్ (ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) పాత్రను కమిటీ అధ్యయనం చేసింది. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీఎన్ఆర్టీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్ వలసదారుల భద్రత, బీమా సౌకర్యాలు, పునరావాస పథకాలపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ పర్యటన తర్వాత తెలంగాణలోని విదేశీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే ఒక సమగ్రమైన ఎన్నారై విధానాన్ని రూపొందించడానికి తెలంగాణ ఎన్నారై సలహా కమిటీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనుంది. ఈ సమావేశంలో ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరి రవి, ఏపీఎన్ఆర్టీ సీఈవో కృష్ణమోహన్ తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ డా.బి.ఎం.వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News