-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని అన్న క్యాంటీన్లలో ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం తన నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, సూర్యారావుపేట, వన్టౌన్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, శుభ్రత పనులు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వన్టౌన్లోని గాంధీజీ మహిళా కళాశాల సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆహారం తీసుకునే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే క్యాంటీన్ పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా తరచూ అధికారులు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు.
ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అన్న క్యాంటీన్లలో తాగునీరు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
తదుపరి అంబేద్కర్ స్మృతి వెనుక భాగంలో ఉన్న అంబేద్కర్ కళావేదిక ప్రాంగణాన్ని కమిషనర్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను సమీక్షించి, ప్రాంగణం పూర్తిగా పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో కళావేదిక పరిసర ప్రాంతాల్లో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Prajavartha Online Telugu News