– ప్రయాణికులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు
– అవసరం మేరకు తాగునీటి పాయింట్లు పెంచాలి
– పీఎన్బీఎస్ లో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆకస్మిక తనిఖీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులకు తాగునీరు, నీడ, పారిశుద్ధ్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ సోమవారం నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బస్స్టేషన్లో స్వచ్ఛమైన తాగునీటికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బస్ స్టేషన్లో అవసరం మేరకు తాగునీటి పాయింట్లను పెంచాలన్నారు. తాగునీటి లభ్యతకు సంబంధించి ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్ స్టేషన్లోని స్టాళ్లు, వ్యాపార సంస్థలు కూడా సామాజిక బాధ్యతగా ప్రయాణికులకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఆయన సూచించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయాలు, పారిశుద్ధ్య పరిస్థితులపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వేసవి కాలంలో వ్యాధులు వ్యాపించకుండా శానిటేషన్ వ్యవస్థ బలోపేతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం) టి.సాయి చరణ్ తేజ, బస్ స్టేషన్ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News