Breaking News

యువ నాయకత్వం పెంపొందించడానికి తగిన వేదిక స్థానిక సంస్థల ఎన్నికలు

-స్థానిక సంస్థలలో వార్డుల పునర్విభజన, ఎన్నికల ప్రక్రియపై క్షేత్ర స్థాయి నాయకత్వానికి క్రియాశీలక పాత్ర ఇవ్వాలి
-స్థానిక సంస్థ ఎన్నికలు, డి లిమిటేషన్ పై ఏర్పాటైన ప్రాంతీయ కమిటీల సభ్యుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
‘జనసేన పార్టీలోని యువ నాయకత్వాన్ని పెంపొందించడానికి స్థానిక సంస్థల ఎన్నికలు తగిన వేదిక. ఇందుకు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి నాయకులను, శ్రేణులను సన్నద్ధం చేయాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికలు, డి లిమిటేషన్ పై ఏర్పాటైన ప్రాంతీయ కమిటీల సభ్యులతో సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు తమ రీజియన్లలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అక్కడి వార్డుల పునర్విభజన, అక్కడి జనసేన నాయకుల అభిప్రాయాలను నివేదిక రూపంలో పార్టీ అధ్యక్షులవారికి అందచేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “స్థానిక సంస్థలలో వార్డుల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు అడిగారు. తదుపరి దశలు, రిజర్వేషన్ వెల్లడి, ఎన్నికల ప్రక్రియ… తదితర అంశాల్లో క్షేత్ర స్థాయి నాయకత్వానికి క్రియాశీలక పాత్ర ఇవ్వాలి. నగరాలు, పట్టణాలు, గ్రామ స్థాయిల్లో బలమైన స్థాయిలో జన సైనికులు, వీర మహిళలు, నాయకులు ఉన్నారు. మనకు 20 వేల మందికిపైగా సాధక్స్, 20 లక్షల మందికిపైగా ఉద్యమి సభ్యత్వం పొందినవారు ఉన్నారు. వారందరినీ పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం చేసేలా రూట్ మ్యాప్ ఇద్దాము. తొలుత మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అందుకు సన్నద్ధత కావాలి. ప్రాంతీయ కమిటీల సభ్యులు ప్రతి జిల్లాలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మనం బలంగా ఉన్న ప్రాంతాలు, నాయకత్వ పటిమ ఉన్నవారిని తక్షణమే గుర్తించాలి” అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ, పంతం నానాజీ,  బొలిశెట్టి శ్రీనివాస్, ఆరణి శ్రీనివాసులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు  సామినేని ఉదయభాను, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు టి.సి.వరుణ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *