– అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సెషన్లు
– హెచ్ఆర్డీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహణ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంపు, సమర్థవంతమైన పరిపాలన లక్ష్యంగా అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఒత్తిడి లేని పనివాతావరణంలో నైపుణ్యాల సమర్థ వినియోగం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం-మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) సెల్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్ట్రెస్ మేనేజ్మెంట్ పై వర్క్షాప్ జరిగింది. సైకాలజిస్టులు
డా. జి.శంకర్ రావు, డా. టీఎస్ రావు, బి.నవితశ్రీ, వై.జ్యోతికృష్ణ బృందం రోజువారీ విధుల నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఒత్తిడికి కారణాలు, భౌతిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, ప్రవర్తనలో వచ్చే మార్పు, పని ఒత్తిడికి కారణాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్పై సెషన్ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు తమ సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాల అమలు, ప్రజా సేవల మెరుగుదల, కార్యనిర్వహణలో సమన్వయం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బందిలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత పనితీరు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డిజిటల్ స్కిల్స్ తదితరాలను పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News