అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముద్ఖేడ్–మెడ్చల్–మహబూబ్నగర్–ధోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదలాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. బుధవారం డిల్లీ నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ప్రగతి (PRAGATI) వీడియో కాన్పరెన్సులో దేశవ్యాప్తంగా వివిధ కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, జాతీయ పథకాల అమలు పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మాట్లాడుతూ ధోన్–మహబూబ్నగర్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23.07 హెక్టార్ల ప్రైవేట్ భూమి సేకరణ అవసరమైందని, దీనికి సంబంధించిన సెక్షన్ 20(A) నోటిఫికేషన్ 25.09.2025న జారీ చేసినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 18.21 హెక్టార్ల భూమి 4 మండలాల్లోని 16 గ్రామాల్లో అవసరమైందని, అందులో 8 గ్రామాల్లో రైల్వే అధికారుల సహకారంతో పెగ్ మార్కింగ్ పూర్తయ్యిందని, మిగిలిన గ్రామాల్లో ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మరో రెండు వారాల్లో 20(E) నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో అవసరమైన 4.86 హెక్టార్ల భూమికి సంబంధించిన పెగ్ మార్కింగ్ పూర్తి కాగా, 20(E) నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి వివరించారు. అలాగే, మొత్తం 4.05 హెక్టార్ల ప్రభుత్వ భూమి బదలాయింపుకు సంబంధించి, రైల్వే అధికారులు అధికారిక రిక్విజిషన్ సమర్పించిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు అడ్వాన్స్ పొజెషన్ ఇవ్వనున్నట్లు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వివరించారు.
ఈ సమావేశంలో బహ్రైచ్–శ్రావస్తి–బలరాంపూర్–సిద్ధార్థనగర్–సంత్కబీర్నగర్ రైల్వే లైన్, ముద్ఖేడ్–మెడ్చల్–మహబూబ్నగర్–ధోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టు, కోల్కతా మెట్రో విస్తరణ పనులు, రాజస్థాన్ పునరుత్పాదక విద్యుత్ సరఫరా వ్యవస్థలకు సంబంధించిన ట్రాన్సుమిషన్ ప్రాజెక్టులు, మహారాష్ట్రలో వధవన్ పోర్ట్ కనెక్టివిటీ రహదారి ప్రాజెక్టు, భారత్మాల పరివోజన కింద అమలవుతున్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ప్రాజెక్టులను మరియు స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు స్థితిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమీక్షించారు.
ఈ వీడియో కాన్పరెన్సులో డిల్లీ నుండి కేంద్ర క్యాబినేట్ సెక్రటరీ డా.టి.వి. సోమనాథన్, రైల్వే బోర్డు చైర్మన్ మరియు సి.ఇ.ఓ. సతీష్ కుమార్ తదితరులతో పాటు రాష్ట్రం నుండి రాష్ట్ర రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ స్పెషల్ సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబు, సి.సి.ఎల్.ఏ. జయలక్ష్మీ, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎం.డి. అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News